తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయి అనే విషయంపై చాలా రోజులనుంచి చాలా రకాల చర్చలు నడుస్తున్నాయి.ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావడం కష్టం అవుతుంది అనే ఉద్దేశంతోనే ఉమ్మడిగా పోటీ చేసి కలిసి అధికారం పంచుకోవాలనే ఎత్తుగడకు వచ్చాయని ప్రచారం జరుగుతూనే ఉంది.
దీనికి తగ్గట్లుగానే ఈ రెండు పార్టీల వ్యవహారాలు ఉండడం, జనసేన మైలేజ్ పెరిగే విధంగా టిడిపి సైలెంట్ అవ్వడం, టిడిపిని ఎక్కడా విమర్శించకుండా, వైసీపీ ని మాత్రమే టార్గెట్ చేసుకుంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తూ ఉండడం, ఇవన్నీ టిడిపి జనసేన పొత్తు అంశాన్ని బలపరుస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికల కి వెళ్ళినా, వైసీపీకి 2024 ఎన్నికల్లో ఎటువంటి డోకా లేదని, మళ్ళీ తప్పకుండా అధికారంలోకి వస్తామనే అభిప్రాయంతో ఏపీ సీఎం జగన్ ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.
ఇప్పటికే ఏపీలో ప్రశాంత్ కిషోర్ టీమ్ రంగంలోకి దిగి పోయింది.నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని అంచనా వేసే పనిలో ఉంది.ఏ అంశాలు ప్రభుత్వానికి నష్టాన్ని చేకూరుస్తున్నాయి ? ప్రజల్లో అసంతృప్తికి కారణం అవుతున్న విషయాలు ఏంటి అనే విషయాలను తెలుసుకునే పనిలో ఉంది.పీకే టీం సర్వే నివేదిక ఆధారంగా ప్రభుత్వ పరంగా చోటుచేసుకుంటున్న తప్పిదాలను సరిచేసుకునే విధంగా జగన్ వ్యవహరించబోతున్నారు.
అలాగే మంత్రిమండలిని పూర్తిగా ప్రక్షాళన చేసి, ఎక్కడా ఎటువంటి విమర్శలకు తావులేకుండా కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.
ఈ మంత్రి మండలి ఏర్పాటులో సామాజికవర్గాల సమతూకం పాటించి అందరికీ ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంతో జగన్ ఉన్నారు.అయితే జనసేన, తెలుగుదేశం పార్టీలు బీసీ, కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుని రాజకీయాలు చేస్తున్నాయి.సామాజిక వర్గాల వారికి మంత్రిమండలిలో ప్రాధాన్యం కల్పించే విధంగా జగన్ ప్రయత్నాలు చేస్తున్నాయి.
టిడిపికి ఎప్పుడూ అండగా నిలిచే బీసీ సామాజిక వర్గం వైసిపికి అనుకూలంగా 2019 ఎన్నికల్లో ఉండడంతో , టిడిపి ,జనసేన పార్టీలు ఆ సామాజిక వర్గాలను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.దీంతో జగన్ కూడా ఆ సామాజిక వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలని చూస్తున్నారు.
తమ రాజకీయ ఎత్తుగడలతో పాటు, ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలను పాటిస్తూ మరోసారి అధికారానికి ఎటువంటి డోకా లేకుండా చేసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.