వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిపోయారు.2024 ఎన్నికల్లో పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు.గతంతో పోలిస్తే దూకుడుగా పార్టీలోను, ప్రభుత్వం లోను ప్రక్షాళన మొదలుపెట్టారు.సామాజిక వర్గాల వారీగా పార్టీకి అండదండలు ఉండే విధంగా కుల గర్జన సభలను పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
ఈసారి తెలుగుదేశం పార్టీతో పాటు, జనసేన నుంచి గట్టి పోటీ ఎదురు కాబోతుండడంతో, దానిని ఎదుర్కొనేందుకు గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు.ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024లో ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో అడుగు పెట్టకూడదనే లక్ష్యాన్ని జగన్ విధించుకున్నారు.
దీనిలో భాగంగానే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా, ఆయనను ఓడించేందుకు బలమైన అభ్యర్థులను జగన్ సిద్ధం చేసుకుంటున్నారు.2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పవన్ పోటీ చేసి ఓటమి చెందారు .అయితే ఈసారి ప్రయోగాల జోలికి వెళ్లకుండా, కాపు సామాజిక వర్గం బలం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ ప్లాన్ చేసుకుంటున్నారు.దీనిలో భాగంగానే ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది.
అక్కడ వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పెండం దొరబాబు ఉన్నారు .అక్కడ కనుక పవన్ కళ్యాణ్ పోటీకి దిగితే , వైసిపి ఎంపీగా ఉన్న వంగ గీతను పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాలని జగన్ భావిస్తున్నారట.ఇక కాపు ఉద్యమ నేత, ఆ సామాజిక వర్గంలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరే అవకాశం ఉండడంతో, ఆయన కనుక పవన్ పై పోటీ చేసేందుకు ఒప్పుకుంటే పిఠాపురం నుంచి ముద్రగడను పోటీకి దింపే ప్లాన్ లో వైసిపి ఉంది.వంగ గీత లేదా ముద్రగడ ఈ ఇద్దరిలో ఒకరిని పిఠాపురం అభ్యర్థిగా నియమించే అవకాశాలు ఉన్నట్లు వైసిపిలో ప్రచారం జరుగుతోంది.