అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలం నుంచి చూసుకుంటే వైసిపి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ఎన్నికల హామీలను నెరవేర్చుకుంది.ఇంకా ఎన్నికల సమయంలో ఇవ్వని హామీలు ఎన్నో అమలు చేసి చూపిస్తోంది.
ఎన్ని చేసినా, వైసీపీ ప్రభుత్వానికి దక్కాల్సిన క్రెడిట్ మాత్రం దక్కడం లేదు.ఈ పథకాలను ప్రచారం చేసుకునే విషయంలో వైసీపీ ప్రభుత్వం సక్సెస్ కాలేకపోవడం, పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవడం, ఇలా ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకున్నా, ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో క్రెడిట్ అయితే దక్కడం లేదు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చిన్న చిన్న పథకాలకు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునే వారు.కానీ ప్రస్తుత ఏపీ ప్రభుత్వం మాత్రం ఆ విధంగా ప్రచారం చేసుకోలేకపోవడంతో తమ ప్రభుత్వానికి దక్కాల్సిన క్రెడిట్ దక్కడం లేదు అనే బాధ చాలా కాలంగా జగన్ లోను కనిపిస్తోంది.
త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో, ప్రభుత్వ పథకాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలనే అభిప్రాయంతో ఏపీ ప్రభుత్వం ఉంది.దీనిలో భాగంగానే సెలబ్రిటీలతో ప్రచారం నిర్వహించాలనే అభిప్రాయంలో జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
దీనికి సంబంధించి సమాచార శాఖ తోనూ చర్చించారట.మొదటి నుంచి వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్న హీరో అక్కినేని నాగార్జున తో పాటు మెగాస్టార్ చిరంజీవిని ఒప్పించి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
వైసీపీ ప్రభుత్వం విషయంలో చిరంజీవి సైతం సానుకూలంగా ఉంటూ వస్తుండడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న జగన్ కాబోయే క్యాబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి పెద్ద ఎత్తున ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ ప్రతిపాదనకు అంగీకరించే అవకాశం ఉన్నట్లుగా వైసిపి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.చిరంజీవి కనుక వైసిపి ప్రభుత్వ పథకాల తరపున ప్రచారం నిర్వహిస్తే , బీజేపీ జనసేన పార్టీ మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.