ఎట్టకేలకు తాను అనుకున్నట్లు గా జగన్ మంత్రివర్గం మొత్తాన్ని రాజీనామా చేయించారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి మంత్రివర్గ విస్తరణ లోనే జగన్ మంత్రులు గా ఎంపిక చేసిన వారికి ఈ విషయాన్ని చెప్పారు.
రెండున్నర సంవత్సరాలు మాత్రమే పదవీకాలం ఉంటుందని, ఆ తర్వాత పూర్తిగా కొత్త మంత్రులు బాధ్యతలు చేపడతారని , దీనికి సిద్ధంగా ఉండాలని సూచించారు.అనుకున్నట్లుగానే జగన్ తన నిర్ణయాన్ని అమలు చేశారు.
ఇప్పుడు మంత్రి పదవులు కోల్పోయిన వారిలో అసంతృప్తి తలెత్తకుండా, పార్టీలో కీలక పదవులను అప్పగించి ఎన్నికల్లో పార్టీని విజయంవైపు తీసుకువెళ్ల విధంగా వారికి బాధ్యతలు అప్పగించ బోతున్నారు.
అలాగే వారికి గతంలో మాదిరిగానే ప్రాధాన్యం కల్పిస్తామని భరోసా కూడా ఇవ్వడంతో, ఎవరు అసంతృప్తి చెందకుండా ఆనందంగానే మంత్రి పదవులకు రాజీనామా చేశారు.
దీంతో ఇప్పుడు జగన్ మంత్రివర్గంలోకి తీసుకోబోతున్న వారి విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.గతంలో ఎప్పుడు చూడని విధంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వైసిపి కీలక నాయకులు చెబుతున్నారు.
జగన్ ఆలోచన ప్రకారం చూసుకుంటే… సామాజికవర్గాల లెక్కల ఆధారంగానే ఈ మంత్రివర్గ విస్తరణ ఉండబోతోంది అనే విషయం అర్థమవుతుంది.ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎక్కువగా అవకాశం ఉందనే విషయం తేలిపోయింది.
అయితే ఆయా సామాజిక వర్గాల వారిని మంత్రులుగా ఎంపిక చేయడం ద్వారా ఆ సామాజికవర్గం మొత్తం వైసీపీ కి అండగా నిలబడతారా అంటే ఆ పరిస్థితి లేదు.కానీ జగన్ మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోవడం లేదు.ఈ విషయంపైనే సొంత సామాజిక వర్గం లోనూ అసంతృప్తి ఉంది.మొదటి మంత్రివర్గ విస్తరణ సమయంలోనే రెడ్డి సామాజిక వర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి.ఇప్పుడు చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం పెట్టే అవకాశం ఉంది .మొదటి నుంచి వైసీపీకి అండదండగా ఉంటూ వస్తున్న ఆ సామాజికవర్గం ఈసారి అసంతృప్తికి గురైతే ఆ పరిణామాలు జగన్ కు మరింత ఇబ్బందికరంగా మారుతాయి.
.