ఫలితం ఎలా ఉంటుంది అనేది పక్కనపెట్టి, తాను ఏం చేయాలి అనుకుంటున్నానో అది చేసి చూపించి తన సత్తా ఏంటో నిరూపించుకునే వ్యక్తి ఏపీ సీఎం జగన్.పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ, పార్టీ పెట్టకముందు జగన్ ఇదే వైఖరితో ఉండేవారు.ఎవరికి భయపడకుండా ధైర్యంగా వ్యవహారాలు చేస్తూ ఉండేవారు.ఆ వైఖరి కారణంగానే జగన్ జైలు పాలు కావలసి వచ్చింది . 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించిన జగన్ వైఖరి లో ఏ మాత్రం మార్పు లేదు.పైగా వైసిపి నాయకులలోనూ, జనాల్లోనూ జగన్ ధైర్యసాహసాల పై మరింతగా నమ్మకం ఏర్పడింది.
అది పార్టీ అఖండ విజయానికి ఒక కారణం అయ్యింది.అధికారంలోకి వచ్చిన జగన్ ధైర్యంగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారని ప్రతిపక్షాలతో పాటు, కేంద్ర అధికార పార్టీ సైతం ఏపీ ప్రయోజనాల విషయంలో నిలదీస్తారు అని అంతా అభిప్రాయపడ్డారు.
అయితే దానికి భిన్నంగా జగన్ వ్యవహార శైలి ఉంటూ వస్తోంది.ఏపీ ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా కేంద్ర అధికార పార్టీ బిజెపి వ్యవహరిస్తున్నా, జగన్ సైలెంట్ గానే ఉండి పోతున్నారు.
ఏపీ కి సంబంధించిన కీలకమైన ప్రాజెక్టులు పరిశ్రమల విషయంలో కేంద్రం వివాదాస్పదంగా వ్యవహరిస్తోంది. ఆయన కేంద్రాన్ని ధైర్యంగా జగన్ నిలదీయలేకపోవడం పై సొంత పార్టీ నాయకులు నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీకి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ వంటి విషయాలలోనూ కేంద్రం వైఖరి పై జగన్ సైలెంట్ గా ఉండిపోవడం కొత్త చర్చకు దారితీస్తోంది.అసలు జగన్ ఈ విధంగా వ్యవహరిస్తారని ఎవరూ ఊహించలేదు.
కేంద్రాన్ని సైతం లెక్క చేయకుండా జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుని కేంద్రంతో ఢీ కొడతారని అంతా భావించారు.
కానీ కేంద్రంతో శత్రుత్వం కంటే మితృత్వం పెట్టుకోవడమే మంచిది అన్నట్లుగా జగన్ వ్యవహారాలు సాగుతున్నాయి.అసలు కేంద్రం ఏం చేసినా దేశ ప్రయోజనాల కోసమే అన్నట్లుగా జగన్ సైలెంట్ గా ఉండి పోవడం , కేంద్రం నిర్ణయాలకు మద్దతు పలుకుతుండడం వంటివి అన్నీ జనాల్లో చర్చకు దారితీస్తున్నాయి.