జగన్ అన్న అంటే అషామాషి వ్యక్తా ? అన్న చెప్పాడంటే చేసి చూపిస్తాడు.అధికారంలోకి వస్తే అద్భుతాలు చేసి చూపిస్తాడు.
అని గొప్పగా చెప్పుకున్నారు వైసీపీ నాయకులు.రాజకీయ ప్రత్యర్ధులు నోరు ఎత్తలేని స్థాయిలో పాలన చేస్తాడని అంతా నమ్మరు.
పార్టీ అధికారంలోకి వచ్చిన మొదట్లో ఉత్సాహం బాగా కనిపించినా, రాను రాను ఆ ఉత్సాహం వైసీపీ నాయకుల్లో తగ్గుతూ వచ్చింది.అది ఎంతగా అంటే , రాజకీయ ప్రత్యర్ధులు గా ఉన్న టీడీపీ, జనసేన నాయకులు పదేపదే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నా, తిరిగి వాటికి సమాధానం చెప్పలేని స్థితిలో ఇప్పుడు వైసీపీ నాయకులు ఉండి పోతున్నారు.
దీనికి కారణం జగన్ వైఖరి.జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దగ్గర నుంచి చూసుకుంటే అన్ని విషయాల్లోనూ పైచేయి సాధించాలని ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా, ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా, అవేమి ఆచరణకు నోచుకోకపోవడం, కోర్టుల్లో సైతం పెండింగ్ లో పడడం, ఇలా ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ప్రతి సందర్భంలోనూ ఇదే తంతు చోటు చేసుకుంటూ ఉండడం, దీనికి తోడు అధికారంలోకి వచ్చేందుకు తగిన సహాయ సహకారాలు అందించిన బిజెపి వైఖరి మారిపోవడం, ప్రతి దశలోనూ ఇరుకున పెట్టే విధంగా కేంద్ర బిజెపి పెద్దలు, బిజెపి నాయకులు వ్యవహరిస్తున్న తీరు, ఇలా ఎన్నో అంశాలు జగన్ కు మరింత ఇబ్బందికరంగా మారింది.అలాగే జగన్ భారీ ఎత్తున అమలుచేసి చూపిస్తున్న ప్రభుత్వ పథకాలు గాని, ప్రభుత్వానికి రావాల్సిన క్రెడిట్ ను జనాల్లోకి తీసుకువెళ్లడం లో కానీ, మీడియా ఒకరకంగా పక్షపాత వైఖరిని అవలంభిస్తోందని, వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి మీడియాతో విరోధం అన్నట్టు గా వ్యవహరిస్తూ ఉండడం, ఇప్పుడు అధికారంలో ఉన్న సమయంలోనూ అదే విధమైన వైఖరితో ఉండటం వంటి కారణాలతో మీడియాలో జగన్ చేస్తున్న మంచి కంటే, చెడు ఎక్కువగా ప్రచారం అవుతోంది.అవే ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి.
ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో జగన్ దూకుడుగా ముందుకు వెళ్దామని చూసినా, కోర్టుల్లో ఆ వ్యవహారం పెండింగ్ లో పడిపోయింది.అలాగే శాసన మండలిని రద్దు చేద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా, అది అమలు సాధ్యం కాలేదు.అలాగే తమ రాజకీయ ప్రత్యర్దులయిన కొంతమంది టిడిపి కీలక నేతలను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించినా , చాలా వరకు అవన్నీ టిడిపి కే కలిసి వచ్చాయి.
అలాగే పెద్దఎత్తున టిడిపి నాయకులను భయభ్రాంతులకు గురి చేసి, తమ పార్టీలో చేర్చుకుని తెలుగుదేశం పార్టీని మరింత బలహీనం చేయాలి అని చూసినా , అది అనుకున్నంత మేర సక్సెస్ కాలేదు సరికదా, మరిన్ని చిక్కులు తీసుకొచ్చాయి.అలాగే సొంత పార్టీలోనే ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసే నాయకులు సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.
ముఖ్యంగా రఘురామకృష్ణంరాజు తో పాటు, మరికొంతమంది ఎమ్మెల్యేలు బహిరంగంగా జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినా, వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో జగన్ నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు గా వ్యవహరిస్తున్నారు.ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా అంశాలే ప్రస్తావనకు వస్తాయి . జగన్ నిర్ణయాలు కొన్ని కొన్ని వివాదాస్పదంగా ఉండడం, వాటిపై జనాల్లోనూ, పార్టీ నాయకులలోనూ వ్యతిరేకత కనిపిస్తున్న, వాటిని సరి చేసుకునేందుకు జగన్ ఒప్పుకోకపోవడం వంటి ఎన్నో అంశాలు జగన్ గ్రాఫ్ జనాల్లో బాగా తగ్గడానికి కారణం అవుతోంది.ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలలో వైసిపి పైచేయి సాధించినా, గతంలో వైసీపీకి గట్టి పట్టు ఉన్న గ్రామాల్లో ఓటమి పాలవడం, అక్కడ జనసేన టీడీపీలు పట్టు సాధించడం, రాబోయే ముప్పుకు సంకేతాలుగా వైసీపీ ప్రభుత్వానికి కనిపిస్తోంది.