వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాల తలపోట్లు ఒకవైపు ఉండగానే, ఇప్పుడు పార్టీలో మరో తలపోటు మొదలయింది.పార్టీకి సంబంధించిన కీలక విషయాలన్నిటినీ టీడీపీకి, ఆపార్టీ అనుకూల మీడియాకు చేరవేసే పనిలో కొంతమంది నాయకులు నిమగ్నమయ్యారు అనే సమాచారం ఇప్పుడు ఆ పార్టీలో కలకలం సృష్టిస్తోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే చేరికల విషయంపై పెద్దగా దృష్టి పెట్టలేదు.పెద్ద ఎత్తున నాయకులను చేర్చుకుంటే, వారిని కంట్రోల్ చేయడం అసాధ్యమని, ముందు ముందు వాటి కారణంగా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఎన్నో రకాలుగా ఆలోచించి జగన్ చేరికల విషయంపై పెద్దగా దృష్టి పెట్టలేదు.
కానీ ఆ తర్వాత, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని బలహీనం చేయాలంటే, ఆ పార్టీ నాయకులను వైసీపీలో చేర్చుకోవాలని, అప్పుడే ఆ పార్టీ బలహీనపడుతుందని జగన్ అభిప్రాయ పడడంతో, వలసలకు గేట్లు తెరిచారు.దీంతో పెద్ద ఎత్తున నాయకులు వైసీపీ బాటపట్టారు.
అలా చేరిన వారిలో కొంతమంది పదవులు దొరగ్గా, మరికొంతమంది వారి హోదాకు ఏ భంగం కలవకుండా పార్టీలో ప్రాధాన్యం దక్కించుకుంటూ వస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఇప్పుడు వైసీపీ లో కోవర్టుల హడావుడి ఎక్కువగా కనిపిస్తోందట.
పార్టీలో జరుగుతున్న అంతర్గత చర్చలు, కీలక నిర్ణయాలు వంటి విషయాలను ఎప్పటికప్పుడు టీడీపీకి, ఆ పార్టీ మీడియాకు చేరవేసే విషయంలో కొంతమంది వలస నాయకులు నిమగ్నం కావడం, వారు ఆ ఉద్దేశంతోనే పార్టీలో చేరడం వంటి వ్యవహారాలు ఇప్పుడు జగన్ వరకు వెళ్లాయి.ఇటీవల జగన్ ఢిల్లీ టూర్ కు సంబంధించిన కొన్ని కీలక విషయాలు వెంటనే రాజకీయ ప్రత్యర్ధులకు, ఆ పార్టీ అనుకూల మీడియా కు చేరిపోవడం, దీనిపై రకరకాల కథనాలు ముందుగానే ప్రచారం కావడం వంటివి ఎన్నో చోటు చేసుకున్నాయి.
దీంతో అసలు టీడీపీకి ఈ విషయాలు ఎవరు చేరవేస్తున్నారు అనే విషయంపై జగన్ దృష్టి పెట్టగా, పార్టీలోని నాయకులే ఇప్పుడు వెన్నుపోటు పొడిచే రాజకీయానికి తెరలేపారనే విషయాన్ని జగన్ గుర్తించారు.వారికి ఎటువంటి అవకాశం దొరక్కుండా , వారిని తగిన సాక్ష్యాలతో పట్టుకొని, పార్టీ నుంచి సాగనంపాలని చూస్తున్నారట .వైసీపీలో ఇప్పుడు జరుగుతున్న తాజా పరిణామాలను టీడీపీకి ప్రచారం చేయడమే పనిగా కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్నారట.అందుకే వలస నాయకులపై జగన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారని ఈ బాధ్యతను కొంతమంది పార్టీ నాయకులకు అప్పగించినట్టు తెలుస్తోంది ప్రస్తుతం వైసీపీలో ఈ కోవర్టుల రాజకీయంపైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోందట.