భార్య ఒక పార్టీలో, భర్త ఒక పార్టీలో ఉండడం తప్పు కాకపోవచ్చు.కానీ ఏదో ఒక సందర్భంలో అది ఇబ్బందికరంగా మారడంతో పాటు రాజకీయ భవిష్యత్తును గందరగోళంలో మాత్రం పడేస్తుంది.
ఇప్పుడు అదే పరిస్థితి దగ్గుపాటి కుటుంబానికి ఎదురయ్యింది.కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు పురంధరేశ్వరి.
ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారడంతో వెంటనే బిజెపిలోకి ఆమె జంప్ చేశారు.తరువాత ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపినా బీజేపీ అధిష్టానం ఆమెను బుజ్జగిస్తూ వచ్చింది.
ఈ ఎన్నికల్లో ఆమె బిజెపి ఎంపీ అభ్యర్థిగా పోటీచేసినా చేదు ఫలితమే ఎదురయింది.ఇక పురంధరేశ్వరి భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు విషయంలోనూ ఇదే పరిస్థితి ఎదురయింది.
వైసీపీలో కీలక నాయకుడిగా అతి కొద్ది సమయంలోనే ఎదిగిన దగ్గుబాటి వెంకటేశ్వరావు పరుచూరి లో ఓటమి చెందారు.అయినా వైసీపీ అధిష్టానం ఆయనకు ప్రాధాన్యత ఇస్తూనే వచ్చింది.కానీ బిజెపి నాయకురాలు గా ఉన్న పురంధరేశ్వరి తరచుగా వైసిపి మీద, జగన్ మీద విమర్శలు చేస్తుండడంతో మీ కుటుంబం అంతా వైసీపీలో ఉంటుందో లేక బిజెపిలో ఉంటుందో తేల్చుకోవాలని దగ్గుపాటి వెంకటేశ్వరరావుకు జగన్ స్పష్టంగా తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది.ముందుగా పురంధరేశ్వరి తో బీజేపీ కి రాజీనామా చేయించాలని దగ్గుబాటి పై వైసిపి అధిష్టానం తీవ్రంగా ఒత్తిడి పెంచుతున్నట్టు సమాచారం.
అయితే ఇదే విషయం జగన్ తో స్వయంగా చెప్పుకునేందుకు వెంకటేశ్వరావు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయనను కలిసేందుకు జగన్ ఆసక్తి చూపించడం లేదట.అంతేకాకుండా గత ఎన్నికలకు ముందు వరకు పర్చూరులో వైసిపి ఇంఛార్జిగా కొనసాగిన రావి రామనాథం బాబు దగ్గుబాటికి వైసీపీలో టికెట్ దక్కగానే టిడిపిలోకి జంప్ చేశారు.
మారిన పరిస్థితులు నేపథ్యంలో ఆయనను మళ్లీ వైసీపీలో చేర్చుకుని ఆయనకు ప్రాధాన్యతలు పెంచారు.దీనిపై ఇప్పటికే దగ్గుబాటి గుర్రుగా ఉన్నారు.తన బాధను చెప్పుకునేందుకు కనీసం విజయ్ సాయి రెడ్డి అపాయింట్మెంట్ దొరుకుతుందేమోనని ప్రయత్నిస్తున్నా ఆయనకు ఆ అవకాశం దక్కడం లేదు.ఏదో ఒక రకంగా జగన్ కలిసి తన రాజకీయ భవిష్యత్తు పై ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన చూస్తుండగా జగన్ మాత్రం దగ్గుపాటి ఫ్యామిలీ అంతా ఏదో ఒక పార్టీలో మాత్రమే ఉండే విషయంలో స్పష్టమైన క్లారిటీ వచ్చిన తరువాత మాత్రమే దగ్గుబాటికి అపాయింట్మెంట్ ఇవ్వాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారట.