వైసీపీ అధినేత జగన్ వేస్తున్న రాజకీయ అడుగులు ఈ ఐదేళ్లను దృష్టిలో పెట్టుకుని కాకుండా మరో పది పదిహేనేళ్ల రాజకీయ జీవితాన్ని గురించి ముందస్తుగా ప్లాన్ చేసుకుని వేస్తున్నట్టుగా కనిపిస్తోంది.అందుకే ఒక్కో అడుగు చాలా జాగ్రత్తగా వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ హవాను బాగా తగ్గించి తాము బలపడాలనే ఆలోచనలో జగన్ ఉన్నారు.అందుకే టీడీపీకి వెన్నుదన్నుగా ఉండే కొన్ని సామజిక వర్గాలపై ఇప్పుడు జగన్ పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాడు.
తెలుగుదేశం పార్టీకి బీసీలు ఎన్టీఆర్ హయాం నుంచి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు.బీసీలకు సొంత పార్టీ టీడీపీ అని చంద్రబాబు తరుచుగా చెబుతూ ఉండేవారు.
బీసీల కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని కూడా పదే పదే అంటూ ఉండేవారు.టీడీపీ విషయంలో అది చాలా వరకూ సరైందే.
ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో బీసీలు బాగా దెబ్బతిన్నారు.రెడ్డి సామజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది.
కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎస్సీ, ఎస్టీలు ఉండేవారు.ఇక బీసీలే నిరాదరణకు గురి అవుతున్నారని, వారిని అక్కున చేర్చుకుని టీడీపీ కొత్త సామాజిక సమీకరణలకు శ్రీకారం చుట్టింది.
ఎన్టీఆర్ హయాంలో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.వారికి కీలకమైన మంత్రిత్వ శాఖలు ఇవ్వడమే కాకుండా స్వతంత్రంగా పనిచేసేవిధంగా చేయగలిగారు.అలాగే చంద్రబాబు హయాంలో కూడా బీసీలకు మంత్రి పదవులు దక్కినా పెత్తనమంతా బాబు, ఆయన కుమారుడు లోకేష్ చేతుల్లోనే ఉండిపోయింది అన్నది నిజం.
అలాగే బీసీల విషయంలో టీడీపీ పెద్దగా ప్రాధాన్యం లేదన్నట్టుగా వ్యవహరిస్తూ వస్తుండడం మెల్లిగా బీసీల్లో అసంతృప్తిని రాజేసింది.దీని ఫలితమే ఎన్నికల ఫలితాలుగా వచ్చాయనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది.
బీసీల్లో ఉన్న ఈ అసంతృప్తిని జగన్ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు సిద్ధం అవుతున్నాడు.ఏలూరులో జరిగిన బీసీల డిక్లరేషన్ లో జగన్ చెప్పిన ప్రతీ మాట ఇపుడు ప్రభుత్వంలోకి రాగానే అమలు చేసి చూపిస్తున్నారు.
బీసీలకు మంత్రి పదవులు అరవై శాతం ఇవ్వడం ద్వారా టీడీపీ కంటే తాను ఎక్కువ చేస్తానని సంకేతాలు ఇచ్చారు జగన్.
అదే విధంగా నామినేటెడ్ పదవుల్లో, కాంట్రాక్టుల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా బాబు కంటే తాను బెటర్ అని నిరూపించుకునే ప్రయత్నం చేశారు.అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం ద్వారా బీసీల మనసు గెలుచుకున్నారు.ఇలా ప్రతి సందర్భంలోనూ బాబు కు అనుకూలంగా ఉండే సామాజికవర్గాలు తమ వైపు తిప్పుకుని మరింతగా బలపడాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు.ఇక ముందు ముందు కూడా బడుగు, బలహీన వర్గాల వారికి అధిక ప్రాధాన్యం కల్పించి వారి సంపూర్ణ మద్దతు తమకు దక్కేలా ప్లాన్ చేసుకుంటున్నారు.