ఇప్పటికే ఇసుక రాద్ధాంతం తో ఏపీలో రాజకీయ పరిస్థితులు రణరంగంగా మారిపోయాయి.ఒకరి మీద మరొకరు దుమ్మెత్తి పోసుకుంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు.
ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుండగా, వారిపై పైచేయి సాధించి పట్టు నిలుపుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తూ రకరకాల ఎత్తుగడలు వేస్తోంది.ఈ నేపథ్యంలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ప్రస్తుతం దీనిపై హైకోర్టులో పిల్ విచారణ జరుగుతుండగానే జనవరిలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని ఇప్పటికే మంత్రులకు జగన్ సూచనలు చేశారు.
దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి విధి విధానాలు రూప కల్పన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
గత ఎన్నికల్లో అమలు చేసిన రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జగన్ భావిస్తున్నారు.చిన్న చిన్న ఇబ్బందులు మినహా వైసీపీ ప్రభుత్వం పరిపాలన పై ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారని, ప్రజా సంక్షేమ పథకాలు అందరికీ సక్రమంగా అందుతుండడంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని జగన్ భావిస్తున్నారు.ఈమేరకు నిఘా వర్గాల నివేదికన కూడా జగన్ ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు.
అందుకే ఈ విషయం ఉత్సాహంగానే జగన్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసింది.
ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు.ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
పార్టీ పరంగా కూడా చాలా బలహీనపడింది.దీని నుంచి బయటపడేందుకు టిడిపి ఇసుక దీక్షలు, ప్రజా పోరాటాలు చేస్తోంది.అయినా పెద్దగా ప్రయోజనం ఉండదు అనే విషయాన్ని వైసిపి గుర్తించింది.ఇక మరో పార్టీ జనసేన రాజకీయంగా వేగం పెంచినా ఆ పార్టీని నమ్మే పరిస్థితిలో జనాలు లేరని, అసలు క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి బలమే లేదు కాబట్టి పెద్దగా తమకు ఎదురు ఉండదు అనే అభిప్రాయం వైసీపీ ఉంది.
ఇక బీజేపీ పరిస్థితి కూడా దాదాపుగా ఈ విధంగానే ఉండడంతో వైసిపి స్థానిక పోరులో తమదే పై చేయి అనే అభిప్రాయం జగన్ లో స్పష్టంగా కనిపిస్తోంది.రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండడంతో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చురుగ్గానే సాగే అవకాశం కనిపిస్తోంది.