ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ,ఇప్పుడు ఆ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి జగన్ తిరుగులేని నాయకుడిగా గుర్తింపు పొందారు.151 ఎమ్మెల్యే ల తో మెజార్టీ సాధించారు.తెలుగుదేశం పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసే ఈ విధంగా బలం పుంజుకున్నారు.ఏపీ లోనే కాదు తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా, అక్కడ బలమైన కేడర్ జగన్ కు ఉన్నా, తెలంగాణ ఏర్పడిన తర్వాత పూర్తిగా ఆ పార్టీని జగన్ పక్కన పెట్టేశారు.
పూర్తిగా ఏపీ రాజకీయాలపై దృష్టి సారించారు.దీనికి కారణం తెలంగాణ సీఎం కేసీఆర్ తో జగన్ కు ఉన్న స్నేహబంధం.అంతే కాకుండా ,అటు టిఆర్ఎస్ కు ఇటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బద్ధశత్రువుగా ఉన్న తెలుగుదేశం పార్టీని మట్టి కరిపించేందుకు, రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
2019 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ జగన్ కు సహకరిస్తూ వచ్చారు.అంతకు ముందు జగన్ సోదరి షర్మిల ఎన్నో రకాలుగా వైసిపిని ఆదుకున్నారు.జగన్ జైలు జీవితం గడిపిన సమయంలోనే షర్మిల పాదయాత్ర నిర్వహించి జగన్ లేని లోటు తీర్చారు.
వైసీపీ ఏపీ లో అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలకు ప్రాధాన్యం ఇస్తారని, కీలక పదవులు ఇస్తారని అంతా అభిప్రాయపడ్డారు.చివరకు వైసీపీ తెలంగాణ బాధ్యతలు అయినా అప్పగిస్తారు అని అంతా భావించారు.
కానీ తెలంగాణలో వైసీపీని బలోపేతం చేసేందుకు జగన్ ఏ మాత్రం ఇష్టపడలేదు.ఇప్పుడు చూస్తే షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే ఆలోచన తో ముందుకు వచ్చారు.
జగన్ మద్దతు లేకపోయినా ఒంటరిగానే పార్టీని ముందుకు నడిపించేందుకు సిద్ధం అయ్యారు.అయితే కేసీఆర్ తో స్నేహం దెబ్బతినకుండా ఉండాలి అంటే షర్మిలకు ఏ విధంగానూ సహకరించకుండా ఉండాలి అనే నిర్ణయానికి జగన్ వచ్చినట్టు సమాచారం.
అంతే కాకుండా తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరూ షర్మిల వైపు వెళ్లకుండా జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.అందుకే తొలిరోజు లోటస్ పాండ్ లో సన్నిహితులతో సమావేశాలు నిర్వహించిన దగ్గర నుంచి జగన్ కానీ, ఆయనకు చెందిన మీడియా కానీ పెద్దగా షర్మిల పార్టీ వ్యవహారం పై స్పందించకపోవడం, కేవలం షర్మిలతో జగన్ కు ఎటువంటి తగువులు లేవు అని జగన్ తన సన్నిహితులతో చెప్పించి చేతులు దులుపుకున్నట్టుగా కనిపిస్తోంది.షర్మిల పార్టీ ద్వారా కేసీఆర్ తో తనకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ముందస్తుగా తీసుకుంటున్న చర్యలు ఆసక్తికరంగా మారాయి.