ఈరోజు వైఎస్ విజయమ్మ నిర్వహించబోయే ఆత్మీయ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.ఈ సభకు రావలసిందిగా వైఎస్ తో సన్నిహితంగా మెలిగిన నేతలు అందరికీ ఆహ్వానాలు అందాయి.
అలాగే టాలీవుడ్ నుంచి అనేక ప్రముఖులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు వెళ్లాయి. టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి, వైసిపి, టిడిపి ఇలా అన్ని పార్టీల నేతలకు ఆహ్వానాలు వెళ్లాయి.
ఇక వైసీపీ లో మంత్రి బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద రావు వంటి వారితో పాటు, కొంతమంది కీలక నేతలకు ఆహ్వానం అందింది.అయితే వారు ఈ సమావేశానికి హాజరు అవుతారా లేదా అనేది ఒక క్లారిటీ లేదు.
ఎందుకంటే ఈ సమావేశాన్ని పేరుకు విజయలక్ష్మి నిర్వహిస్తున్నా, మొత్తం వ్యవహారాన్ని షర్మిలనే చూసుకుంటున్నారు.దీంతో వైసిపి కూడా ఆలోచనలో పడింది.
ఇది ఆత్మీయ సమావేశం కాదు అని, రాజకీయ సమావేశం అంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చేశారు.
తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టిందని, దాని కోసం ఆమె సభ ఏర్పాటు చేశారని, దాంట్లో తప్పేముంది అని సజ్జల ప్రశ్నిస్తున్నారు.
అయితే ఇది రాజకీయ సభ కాదని, ఆత్మీయ సమావేశం అని ఇందులో ఎటువంటి రాజకీయాలకు తావు లేదు అంటూ విజయలక్ష్మి తమ సన్నిహితుల ద్వారా మీడియాకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.అయినా వైసీపీ మాత్రం దీనిని రాజకీయ కోణంలోనే చూస్తోంది.
ఇది రాజకీయ సభ కాబట్టి తమ పార్టీ తరపున ఎవరూ హాజరు కావడం లేదంటూ సజ్జల ప్రకటించేశారు.అయితే వైఎస్ కు అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన నాయకులు మాత్రం సభకు వెళ్లే విషయంపై తర్జనభర్జన పడుతున్నారు.
ఇప్పటికే ఈ సభకు అనుమతి లేదన్న విషయం రుజువు కావడంతో, విజయమ్మ ఆహ్వానం మేరకు ఆ సభకు వెళ్లినా, ఆ తర్వాత జగన్ నుంచి తీవ్ర ఆగ్రహం ఎదుర్కోవాల్సి ఉంటుందని, తమ రాజకీయ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందనే ఆలోచనలు చాలా మంది ఉన్నారట.
వీలైనంత ఎక్కువ మంది ఈ సమావేశానికి హాజరు కాకపోవడమే మంచిది అని అభిప్రాయపడుతున్నారట.అయితే ఈ సమావేశం సందర్భంగా వైసిపికి విజయలక్ష్మి రాజీనామా చేస్తారని, షర్మిల పార్టీలో యాక్టివ్ గా పాల్గొనబోతున్నట్టు ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.ఇదిలా ఉంటే విజయమ్మ నిర్వహిస్తున్న ఈ సమావేశంపై జగన్ కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం.
ఎవరెవరు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది ? ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించబోతున్నారు అనే విషయాన్ని తమ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన కొంతమంది వ్యక్తుల ద్వారా ఆరా తీస్తున్నట్లు సమాచారం.