ఒక్కోసారి కొన్ని కొన్ని సమస్యలకు పరిష్కారం దొరకడం కష్టం అవుతుంది.మరికొన్నింటికి పరిష్కారం దొరికినా క్లారిటీ లేకుండా ఇబ్బంది పెట్టేస్తుంటుంది.
ఇప్పుడు అదే పరిస్థితి కొత్త ముఖ్యమంత్రి జగన్ విషయంలోనూ ఎదురయ్యి ఇరుకునే పెట్టేలా కనిపిస్తోంది.ఎన్నో తలకు మించిన హామీలు ఇచ్చి ప్రజల అభిమానాన్ని చూరగొని అధికారంలోకి వచ్చాడు జగన్.
ఇప్పుడు ఆ హామీలు అన్ని ఒక్కొక్కటీ అమలు చేసుకుంటూ వస్తున్నాడు.కానీ ప్రధాన హామీ అయిన ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో జగన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు.
ఎందుకంటే హోదా విషయంలో ఏపీ ప్రజలతో ఆడుకుంటున్న బీజేపీ మళ్లీ ఇప్పుడు అధికారంలో ఉంది.ముంచినా తేల్చినా బీజేపీనే తేల్చాలి.
కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీని గట్టిగా నిలదీసే ధైర్యం జగన్ కు ఉన్నట్టుగా కనిపించడంలేదు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ ప్రకటించింది.అయితే ఆ విషయాన్ని విభజన చట్టంలో పెట్టకుండా కేవలం నోటి మాటతో సరిపెట్టేసింది.కానీ ఆ తర్వాత కాంగ్రెస్ అధికారం లోకి రాలేదు.
దీంతో తర్వాత వచ్చిన బీజేపీ అప్పటి విభజన సమయంలో ఏపీకి ఐదేళ్లు కాదు, హోదా పదేళ్లు కావాలని అడిగిన బీజేపీ నాయకులు తరువాత మాట మార్చేశారు.ఇక, ఏపీలో విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కూడా నాలుగున్నరేళ్ళ పాటు బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది.
కానీ ఆ సమయంలో హోదాపై ఏ విషయం తేల్చకుండా సైలెంట్ గా ఉండిపోయింది.
హోదా విషయంలో అప్పట్లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్ గట్టిగా పట్టుబట్టాడు.
ప్రజల్లోనూ ఈ తరహా సెంటిమెంట్ ఎక్కువగా ఉండడంతో ఎన్నికలకు ఆరునెలల ముందు బాబు యు టర్న్ తీసుకున్నాడు.ధర్మపోరాట దీక్షలు అంటూ హడావుడి చేసినా ఫలితం కనిపించలేదు.
ప్రస్తుతం ఏపీలో జగనే అధికారంలోకి వచ్చారు.ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామన్నారు.
అయితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మాత్రం ఏపీ విషయంలో పాత పాటే పడుతోంది.ఏపీకి హోదా ఇచ్చేది లేదని, ప్యాకేజీకి మాత్రమే ఇస్తామని చెప్పుకొస్తున్నారు.
ఈ నేపథ్యంలో జగన్ కు ఏమి చేయాలో పాలుపోవడంలేదు.బీజేపీ ప్రభుత్వం ప్రకటించినట్టుగా ప్రత్యేక ఫ్యాకేజి తీసుకుంటే ప్రజల్లో లోకువ అయిపోతాం, అలాగే ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ గట్టిగా పట్టుబడితే బీజేపీ ప్రభుత్వ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుండుందని జగన్ భయపడుతున్నాడు.