ఏపీ తెలంగాణ మధ్య ఇప్పుడు జల వివాదం మొదలైంది.పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా రాయలసీమ ప్రాంత ప్రజలకు సాగు తాగునీరు అందించేందుకు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 203 పై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రాద్ధాంతం జరుగుతోంది.
ముఖ్యంగా ఈ విషయంలో తెలంగాణ రాజకీయ పార్టీలన్నీ ఏకమై ఏపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా గళమెత్తి పోరాడేందుకు సిద్ధమవుతున్నాయి.తాజాగా సిపిఐ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పోతిరెడ్డిపాడు అడ్డుకోవడంపై చర్చించారు.
అలాగే ఈరోజు కూడా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు.అలాగే నిన్ననే తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ శ్రేణులతో పోతిరెడ్డిపాడు విషయంపై చర్చించారు.
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా అదనంగా నాలుగు టీఎంసీల నీటిని తీసుకువెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్నా కేసిఆర్ మౌనంగా ఉన్నారని, ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో కు వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణలో ధర్నాలు నిర్వహించేందుకు కూడా కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.ఇక తెలంగాణ బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా పోతిరెడ్డిపాడు విషయంలో ఏపీ ప్రభుత్వం తీరును తప్పు పట్టారు.అలాగే టిఆర్ఎస్ నాయకులు కూడా చాలామంది ఏపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ విమర్శలు చేశారు.తెలంగాణ ప్రయోజనాలను ఏపీ ప్రభుత్వం దెబ్బతీస్తుందనే ఉద్దేశంతో తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు మూకుమ్మడిగా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టాయి.
అయితే ఏపీలో మాత్రం విచిత్రమైన రాజకీయాలు నెలకొన్నాయి.
ముఖ్యంగా ఏపీ ప్రయోజనాలను కాపాడేందుకు జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తుండగా, మిగిలిన రాజకీయ పక్షాలు ఈ విషయంలో తలదూర్చడం ఎందుకని పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.ఈ విషయంలో జగన్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాత్రమే ప్రకటన విడుదల చేశారు.కానీ ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించలేదు.
మొన్నటి వరకు అమరావతి ఉద్యమంలో యాక్టివ్ గా ఉంటూ వచ్చిన కన్నా , రాయలసీమకు మేలు చేసే ఈ ప్రాజెక్టు విషయంలో కనీసం స్పందించలేదు.రాయలసీమలోని కోట్లాది మందికి సాగు, తాగునీరు అందించే విధంగా జగన్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో విషయంలో తెలంగాణ లో అన్ని రాజకీయ పార్టీలు ఏకమై విమర్శలు చేస్తుండగా, ఏపీలో మాత్రం ఆ స్ఫూర్తిని తీసుకునేందుకు ఏ రాజకీయ పార్టీ ముందుకు రావడం లేదు.
అసలు ఏపీ ప్రయోజనాలు తమకు అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తుండడం విమర్శలు పాలు చేస్తోంది.
కేవలం రాజకీయ ప్రయోజనాలు, ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకే తాము పరిమితం అన్నట్టుగా టీడీపీ, జనసేన, బీజేపీ లోని ఒక వర్గం వ్యవహరిస్తుండడం పై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలబడి పోరాటం చేయాల్సిన ప్రతిపక్షాలు ఇలా వ్యవహరించడం సరి కాదనే వాదనలు తెరమీదకు వస్తున్నాయి.