జగన్ చంద్రబాబు ఇద్దరూ, రాజకీయ బద్ద శత్రువులే.ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, ప్రతి విషయంలోనూ రాజకీయంగా పై చేయి సాధించాలని చూస్తూ ఉంటారు.
టిడిపి లోపాలను వైసిపి ఎత్తి చూపిస్తే, వైసిపి లోపాలను టిడిపి ఎత్తి చూపిస్తూ, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తూ ఉంటారు.ఈ విషయంలోనూ ఇద్దరు నాయకుల మధ్య ఏకాభిప్రాయం లేదు.
ఎడ్డెమ్ అంటే తెడ్డెం అన్నట్లు గా ఇద్దరు వ్యవహరిస్తూ ఉంటారు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు ఒకే విషయంపై పూర్తిగా సైలెంట్ అయిపోవడం, అసలు ఆ ప్రస్తావన తీసుకువచ్చేందుకు వెనుకడుగు వేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్ర ప్రయోజనాల అంశంలో అధికార, ప్రతిపక్షాలు ఏకమై కేంద్రంపై పోరాటం చేసి, తమకు రావాల్సిన నిధులు సాధించుకుని, హక్కుల కోసం పోరాటం చేయాల్సి ఉన్నా, ఎక్కడా ఆ వైపుగా అడుగులు వేయడం లేదు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయిపోయిన ఏపీకి ఇప్పుడు కేంద్ర సహకారం అవసరం.
కానీ ఇటు టిడిపి గాని, వైసీపీ గాని కేంద్రాన్ని నిలదీసేందుకు భయపడి పోతున్నాయి.ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని నిలదీసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి.
అప్పట్లో ఏపీకి ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు పోరాటం చేశాయి.
అప్పట్లో టిడిపి బీజేపీ పొత్తు ఉన్న సమయంలో వైసీపీ ప్రత్యేక హోదా అంశంపై పోరాటం చేసింది.ఇక ఆ తర్వాత టిడిపి బిజెపి పొత్తు తెగిపోయిన తర్వాత, బీజేపీపై కోపంతో టిడిపి ప్రత్యేక హోదా అంశాన్ని మళ్లీ లేవనెత్తింది.అయినా బిజెపి మనసు కరగలేదు.అప్పట్లో ఈ అంశంపై బిజెపిపై టిడిపి వైసిపిలు పోరాటం చేసినా, ఇప్పుడు మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయాయి.151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది పార్లమెంటు సభ్యులు ఉన్న వైసిపి కానీ, 20 మంది ఎమ్మెల్యే , ముగ్గురు ఎంపీల మద్దతు ఉన్న టిడిపి కానీ, ప్రత్యేక హోదా అంశంలో బీజేపీని నిలదీసేందుకు వెనకడుగు వేస్తున్నాయి.
ఇదే కాదు, విద్యుత్ సంస్కరణల విషయంలో నోరు ఎందుకు కూడా ఇష్ట పడడం లేదు.దీనికి కారణం వైసీపీకి కేంద్ర మద్దతు చాలా అవసరం.వివిధ పథకాల నిమిత్తం నిధులు సమృద్ధిగా అందాలంటే, కేంద్ర సహకారం తప్పనిసరి.ఇక టీడీపీ విషయానికి వస్తే, గత ప్రభుత్వంలో నెలకొన్న అవినీతి అక్రమాలపై టీడీపీ ని టార్గెట్ చేసుకునేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోంది.
టిడిపిని టార్గెట్ చేసుకుంటూ ఏపీలోనూ బీజేపీ రాజకీయాలు చేస్తోంది.ఈ తరుణంలో బిజెపి పై పోరాటానికి దిగితే జరిగే నష్టం ఏమిటో చంద్రబాబు కు బాగా తెలుసు.
అందుకే అటు జగన్ కానీ, ఇటు చంద్రబాబు గాని, బిజెపిని నిలదీసే విషయంలో వెనుకడుగు వేస్తున్నారు.ప్రత్యేక హోదా అంశాన్ని సాగదీస్తూ వస్తున్నారు.హోదా అంశాన్ని పలికేందుకే ఇష్టపడడం లేదు.ఈ విషయంలో బీజేపీ తో పొత్తు పెట్టుకున్న జనసేన పరిస్థితి దాదాపు ఇదే విధంగా ఉంది.