పైకి అంతా బాగానే ఉంది అనుకుంటున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలు ఆ పార్టీ నేతలకు సైతం ఆందోళన కలిగిస్తున్నాయి.2019 ఎన్నికలకు ముందు జగన్ అధికారంలోకి వస్తారని అంచనా అందరిలోనూ ఉన్నా, 151 సీట్లతో ఘన విజయాన్ని నమోదు చేసుకుంటారని ఎవరూ ముందుగా ఊహించలేకపోయారు.ఇది పాదయాత్ర ద్వారా జగన్ కు వచ్చిన క్రేజ్ అనుకున్నా, గత టీడీపీ ప్రభుత్వంలో నాయకుల అవినీతి వ్యవహారాలు కారణంగా, ఆ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవ్వడం కారణంగా కూడా కావొచ్చు.ఏది ఏమైనా జగన్ తిరుగులేని అధికారాన్ని ఏపీలో సంపాదించుకున్నారు.
ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీలోనూ మొదలైనట్లు కనిపిస్తుంది.
ఎక్కడికక్కడ నాయకుల మధ్య విభేదాలు పెరిగిపోతుండటం, కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల అవినీతి వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం చేసుకోవడం, అవినీతికి పాల్పడుతుండడం వంటి పరిణామాలు కొంతకాలంగా మీడియాలోనూ హైలెట్ అవుతున్నాయి.
అయితే అటువంటి వారికి జగన్ వార్నింగ్ ఇచ్చి ఊరుకోవడంతో పరిస్థితి అదుపుతప్పుతున్నట్టుగా కనిపిస్తోంది.ఈ తరహా వ్యవహారం టీడీపీ ప్రభుత్వంలోనూ నెలకొనడంతో ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరగడంతో పాటు, కొన్ని ప్రధాన సామాజిక వర్గాలు టీడీపీకి దూరమయ్యాయి.
ఇదంతా మంత్రులకు, ఎమ్మెల్యేలు, కొంతమంది నాయకుల కారణంగా చోటు చేసుకుంది.అప్పట్లో ఈ వ్యవహారంపై పూర్తిగా కట్టడి చేయడం మానేసి, అవినీతి వ్యవహారాలపై కేవలం వార్నింగ్ లతో సరి పెట్టడంతో టీడీపీ ఈ రకమైన గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది.ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీకి కూడా ఎదురు అవుతున్నట్టుగా కనిపిస్తోంది.కొన్ని కొన్ని చోట్ల నాయకుల అవినీతి వ్యవహారాలపై ప్రజల్లో తీవ్ర స్థాయి చర్చ జరగడమే కాకుండా, వైసీపీ ప్రభుత్వానికి, జగన్ ఆశయాలకు కూడా గండి పడుతోంది.
ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నాయకులకు, ముందు నుంచి వైసీపీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులకు మధ్య విభేదాలు ఎక్కడికక్కడ చోటు చేసుకుంటున్నాయి.
ప్రతి నియోజకవర్గంలో ఇదే రకమైన పరిస్థితి ఉండడం అన్ని నియోజకవర్గాల్లోనూ 2 ,3 గ్రూపులు ఉండడంతో పార్టీ శ్రేణులతో పాటు, ప్రజల్లోనూ అయోమయం నెలకొంది.
ఈ విషయంలో జగన్ సీరియస్ గా దృష్టి పెట్టి కట్టడి చేయకపోతే, టీడీపీ ప్రభుత్వానికి పట్టిన గతే వైసీపీకి కూడా పట్టే అవకాశం లేకపోలేదనే విశ్లేషణలు మొదలయ్యాయి.