కులాలకు, వర్గాలకు, ప్రాంతాలకు, మతాల లెక్కల చూసుకోకుండా రాజకీయం చేద్దామంటే ప్రస్తుత పరిస్థితుల్లో కుదరని పని.రాజకీయాలంటేనే వీటన్నిటితోను ముడి పడి ఉంటుంది.
వీటిని పరిగణనలోకి తీసుకోకుండా రాజకీయాలు చేద్దాం అంటే నడవని పరిస్థితి ఉంది.పైకి కులాలు, మతాలు తాము చూడమని ఎంత గట్టిగా చెప్పినా, వాస్తవంలో మాత్రం వాటిని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సిందే అన్నట్టుగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఉన్నాయి.
ఇక రేపు ఏపీ మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది.నిన్నటి వరకు మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ తమ పదవులకు రాజీనామా చేసిన నేపథ్యంలో వారి స్థానంలో మరో ఇద్దరిని జగన్ కేబినెట్ లోకి తీసుకుంటున్నారు.
ప్రస్తుతం రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ సామాజిక వర్గాలకు చెందిన వారినే జగన్ ఎంపిక చేస్తున్నారు.శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పల రాజు మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వారు, డాక్టర్ గానూ ఆయనకు మంచి పేరు ఉండటంతో ఆయన పేరును జగన్ పరిగణలోకి తీసుకున్నారు.
అలాగే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రపురం ఎమ్మెల్యే వేణుగోపాల కృష్ణ మంత్రి పదవిని జగన్ ఖాయం చేశారు.ఇదంతా లాంఛనమే అయినా, ప్రస్తుత మంత్రులుగా ఉన్న ఇద్దరికి జగన్ ప్రమోషన్ కల్పించబోతున్నట్లు వైసీపీ లో నడుస్తున్న చర్చ.ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రస్తుత మంత్రి ధర్మాన కృష్ణదాస్ కు ఉప ముఖ్యమంత్రి గా అవకాశం కల్పించాలని చూస్తున్నారట.బీసీ సామాజిక వర్గానికి చెందిన కృష్ణదాస్ కు కీలక పదవి ఇవ్వడం ద్వారా, ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఉన్న బీసీలను ఆకర్షించాలనేది జగన్ ప్లాన్ గా తెలుస్తోంది.
అలాగే తూర్పు గోదావరి జిల్లాలో కాపు సామాజికవర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అక్కడ పార్టీపై పట్టు పెంచుకునేందుకు ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కు ఉప ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించాలని జగన్ డిసైడ్ అయినట్టు సమాచారం.
ఇద్దరికీ ప్రమోషన్ ఇవ్వడం ద్వారా కాపు , బిసి సామాజిక వర్గాల్లో మరింత పట్టు పెరుగుతుందని, అలాగే కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే తూర్పు లో జనసేన బలపడేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో కన్నబాబు కు ప్రాధాన్యం పెరిగితే, జనసేన కు చెక్ పెట్టవచ్చు అనే ఆలోచనలో జగన్ ప్రమోషన్ కల్పిస్తున్నరట.ఇదంతా ఇలా ఉంటే, జగన్ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలకు, జగన్ కు అత్యంత సన్నిహితమైన వారికి పెద్దగా ప్రాధాన్యం కలిపించకపోవడంపై వారంతా కాస్త ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.మిగతా సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ సొంత సామాజిక వర్గాన్ని జగన్ పక్కన పెట్టడం సరికాదని వీరంతా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మంత్రుల్లో కొంతమంది పనితీరుపై జగన్ అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఆ మంత్రుల శాఖలో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్టు గాను సమాచారం అందుతోంది.