వైసీపీ అధినేతగా, ఏపీ సీఎంగా జగన్ రెండు పడవల మీద చాలా బ్యాలన్స్ గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.ఎన్నికల ముందు వరకు పార్టీని పటిష్టం చేసేందుకు జగన్ శక్తి వంచన లేకుండా కృషి చేశారు.
తమ పార్టీలోని నాయకుల సాధక బాధకాలు అన్ని ఓపిగ్గా వింటూ ఎక్కడ లోపం ఉందో దాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్లేవారు.వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూనే పార్టీ నేతలకు ప్రాధాన్యం ఇస్తూ జగన్ పార్టీని ముందుకు తీసుకు వెళ్ళేవారు.
అయితే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం, జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి.కానీ మునుపటి వలె పార్టీ నాయకులను కలిసే తీరిక జగన్ కు ఉండడం లేదు.
జిల్లాస్థాయి నాయకులకు కూడా జగన్ అపాయింట్మెంట్ దొరకడం గగనమైపోతోంది.ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎండనక వాననక తిరిగి మరీ ప్రచారం చేసిన జగన్, ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాత్రం ఆ ఎమ్మెల్యేలు ఎంపీలను కలుసుకునే తీరిక కూడా లేకుండా గడుపుతున్నారు.ప్రస్తుతం ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు సగం మందిని కూడా జగన్ కలవలేదు.పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటుతున్నా వీరి ప్రాధాన్యతను జగన్ పెద్దగా గుర్తించడం లేదన్న విమర్శలు కూడా జగన్ కు వస్తున్నాయి.
వాస్తవానికి ఏపీలో జగన్ పార్టీ వైసీపీ అధికారంలోకి వచ్చినా క్షేత్రస్థాయిలో పార్టీని సమర్థవంతంగా నడిపించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు ఎంపీలకు ఉంటుంది.వారి బలం, బలగం తోడైతేనే పార్టీకి విజయం దక్కుతుంది.
కానీ అంత ప్రాధాన్యత ఉన్న నాయకులను కలిసేందుకు జగన్ కు తీరిక ఉండడం లేదు.
వైసీపీఎల్పీ నేతగా జగన్ కేవలం ఒక్కసారి మాత్రమే 150 మంది ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించారు.
ఇక అప్పటి నుంచి పార్టీలో ఆ ఊసేలేదు.ఇక ఎంపీలతో జగన్ మీటింగ్ లు పెడుతున్నా, తాను చెప్పాల్సిన విషయాలను చెప్పడం తప్ప, ఎంపీలు చెప్పే విషయాలను జగన్ పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి.
కనీసం జిల్లా స్థాయిలో అప్పుడప్పుడు సమావేశాలు నిర్వహించి ఆ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరిని పిలిచి వారి సూచనలు ఇబ్బందులు వింటే వారిలో కొంత మేరయినా ఉత్సాహం కలుగుతుంది.త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల్లో కొత్త ఉత్సాహం ఉప్పొంగాలంటే జగన్ తగిన సమయం కేటాయించి మరి వారితో మాట్లాడితే బాగుంటుంది కానీ వీటన్నిటిని పట్టించుకునే ఈ పరిస్థితుల్లో జగన్ కనిపించడం లేదు.