కరోనా కష్టకాలంలోనూ ప్రజలకు ఇబ్బంది రాకుండా, సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం.పక్క రాష్ట్రాల్లో ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తున్నా, ఏపీలో మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయిలో జీతాలు చెల్లిస్తామంటూ జగన్ చెబుతూ మొండిగా ముందుకు వెళ్తున్నారు.
ఒకపక్క లాక్ డౌన్ కారణంగా అన్ని కార్యకలాపాలు ఎక్కడికక్కడ స్థంబించిపోవడంతో అన్ని రాష్ట్రాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.ఈ పరిస్థితుల్లో సంక్షేమ పథకాలకు కోతలు విధిస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంటూ, అన్నిరాష్ట్రాలు ముందుకు వెళుతున్నాయి.
పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనా కష్టకాలంలో ప్రజలకు నెలకు 1500 ఇస్తామని ముందుగా ప్రకటించినా, ఇకపై ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసింది.అంతేకాకుండా ఉద్యోగులకు యధావిధిగా జీతాల్లో కోత విధిస్తామని ప్రకటించారు.
కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి రాకుండా జగన్ చూసుకుంటున్నారు. ఏపీ ఖజానా ఖాళి అయిపోవడంతో తప్పని సరి ఈ పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెడుతోంది.
ఈ విషయంపై టిడిపి బిజెపి నాయకులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.అభివృద్ధి, సంక్షేమ పథకాలు, జీతాలకు కోత, ఇలా వేటి కీ కోత విధించకుండా ఆస్తులు అమ్మకూడదు అయినా ప్రభుత్వాన్ని సక్రమంగా నడపాలి అన్నట్లుగా ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నాయి.ఈ విమర్శలతో వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది.ఏపీ పరిస్థితి ఏ విధంగా ఉందో కేంద్రానికి తెలియంది కాదు.విభజన కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనే విషయం కేంద్రానికి తెలుసు.ఈ సమయంలో రాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకోవాల్సిన కేంద్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం భూములను అమ్మకానికి పెడుతోంది.
ఈ విషయంలో కేంద్రాన్ని గట్టిగా నిలదీసి నిధులు రాబట్టుకోవాల్సి ఉన్నా, జగన్ మాత్రం ఆ విధంగా వ్యవహరించడం లేదు.పోనీ ఇప్పుడు విమర్శలు చేస్తున్న ఏపీ బీజేపీ నేతలు కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకొస్తున్నారా అంటే అదీ లేదు.విమర్శలు చేయడం వరకే తమ పని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.ఏపీలో ఆస్తులు, అప్పులు చేయకూడదు కానీ అభివృద్ధి జరిగిపోవాలి అన్నట్టునా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి.పోనీ నిధుల విషయంలో కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తే నిధులు రాబట్టుకునే అవకాశం ఉన్నా, జగన్ ఆ విధంగా ముందుకు వెళ్ళలేక పోతున్నారు.బిజెపి, వైసిపి మధ్య ఇప్పుడు విభేదాలు ఉన్నాయి.
ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
ఈ సమయంలో జగన్ బిజెపిని గట్టిగా నిలదీస్తే ప్రజల్లోనూ సానుభూతి వ్యక్తం అవుతుంది.
కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తోంది అనే అభిప్రాయం ప్రజల్లో మొదలౌతుంది.కానీ జగన్ ఆ విధంగా చేయకుండా కేవలం ఆస్తులను అమ్మకానికి పెట్టి తాత్కాలికంగా ఆర్థిక కష్టాలు తీర్చుకుంటాను అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
తాత్కాలికంగా ఈ వ్యవహారం నడిచినా ముందు ముందు మాత్రం ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందులు తీసుకురావడం మాత్రం తప్పదు.