వైసీపీ అధినేత జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో కోడి కత్తి తో చేసిన దాడి దేశవ్యాప్తంగా… సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఇటీవలే ఆ కేసును హైకోర్ట్ ఆదేశాల మేరకు ఎన్ ఐ ఏ కు అప్పగించిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పడు ఆ కేసు నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు కి సంబంధించి ఆసక్తికర కథనం ఒకటి వెలుగులోకి వచ్చింది.అతగాడు ఏకంగా పుస్తకమే రాస్తున్నాడని ప్రచారం మొదలయ్యింది.
అయితే ఇదంతా టిడిపి ఆడిస్తున్న డ్రామా అని వైసీపీ ఆరోపిస్తోంది.
ప్రస్తుతం విశాఖ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న నిందితుడు శ్రీనివాసరావు ‘మార్పు కోసం’ పేరుతో ఓ పుస్తకాన్ని రాసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.అయితే శ్రీనివాసరావు రాసినట్లుగా చెబుతున్న 11 పేజీల లేఖలో పేర్కొన్న అంశాలనే ఓ పుస్తకంగా ముద్రించి నిందితుడికి ప్రచారం కల్పించాలని భావిస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.మరోవైపు తాను చెప్పదలుచుకున్న అంశాలను శ్రీనివాసరావు 22 పేజీల నోట్బుక్లో రాసినట్టు అతడి తరపు న్యాయవాది ఎ.సలీం అంటున్నారు.దీన్ని విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని హోంశాఖ మంత్రి, జైళ్ల శాఖ డీఐజీ, డీజీలకు లేఖ రాస్తానని చెప్పారు.
ఇంతకీ ఆ నిందితుడు ఏ మార్పు కోరుకుంటున్నాడు అనేది ఆ పుస్తకం విడుదల అయితే కానీ తెలియదు.