తన సొంత జిల్లా కడప లోని బద్వేలు నియోజకవర్గంలో జరగబోతున్న ఉప ఎన్నికలను వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తున్నారు.తనకి , తమ పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతం కావడంతో ఎన్నికల్లో గెలుపు పై జగన్ కు ఎటువంటి ఆందోళన లేదు.
తప్పకుండా తమ పార్టీ అభ్యర్థి దాసరి సుధాకర్ గెలుస్తారనే నమ్మకం జగన్ లో కనిపిస్తోంది.అయితే ఇక్కడ మెజారిటీ విషయంలోనే జగన్ సీరియస్ గా దృష్టి పెట్టారు.
తమ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు , నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. జనసేన, తెలుగుదేశం పార్టీలు పోటీ చేయకపోయినా , ఖచ్చితంగా బిజెపి అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశం ఉండడంతో, జగన్ చాలా జాగ్రత్తగానే వ్యూహాలను రూపొందిస్తున్నారు.
ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఇంచార్జిలు అందరితోనూ ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ, అక్కడ వాస్తవ పరిస్థితులు ఏమిటి అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. అలాగే ఎన్నికల ప్రచారం సందర్భంగా జనాల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పై ఈ నియోజకవర్గం ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాలు ఏమిటి ? ఏ మండలంలో ఎంత మెజారిటీ వస్తుంది అనే లెక్కలను పక్కగా ఆరాతీస్తున్నారు.ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ కు చెందిన టీమ్ సైతం ఈ నియోజకవర్గంలో పరిస్థితులను ఆరా తీసే పనిలో ఉంది.బద్వేల్ నియోజకవర్గ లో వైసీపీ అభ్యర్థి గెలుపు బాధ్యతలు మొత్తం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారు.
ఆయన కనుసన్నల్లోనే ఇక్కడ పార్టీ శ్రేణులు పని చేస్తున్నాయి.ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్, అదిములపు సురేష్ బాబు , ఆనంద్ భాష , వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి వంటి వారికి బాధ్యతలు అప్పగించారు.
ఇక బద్వేల్ మున్సిపాలిటీ ఇన్చార్జి గా గడికోట శ్రీకాంత్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, అట్లూరు మండలం ఇన్చార్జిగా జగన్ మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, కలసపాడు మండలం ఇన్చార్జిగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, బి కోడూరు మండలం ఇన్చార్జిగా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, శ్రీ అవధూత కాశి నాయన మండలం ఇన్చార్జిగా జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, పోరుమామిళ్ల మండలం ఇన్చార్జిగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ,గోపవరం మండలం ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లకు బాధ్యతలను అప్పగించారు.ఎప్పటికప్పుడు జగన్ టచ్ లో ఉంటూ పరిస్థితులను ఆరాతీస్తూ భారీ మెజారిటీతో వైసిపి అభ్యర్థి గెలిచేలా పక్కగా ప్లాన్ చేశారు.