చూస్తూ చూస్తూనే జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి అప్పుడే ఏడాది పూర్తయ్యింది.ఈ ఏడాదిలో ఎన్నో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా జగన్ నిలిచారు.
అసలు జగన్ అధికారంలోకి రావడమే ఒక సంచలనం.పార్టీ పెట్టిన తొమ్మిది ఏళ్లపాటు పార్టీని జనాల్లోకి తీసుకెళ్లే క్రమంలో జగన్ ఎన్నో ఆటుపోట్లు, వెన్నుపోట్లూ ఎదుర్కొన్నారు.
రాష్ట్రమంతా పాదయాత్ర చేపట్టి ప్రజలలో చెరగని ముద్ర వేసుకున్నాడు.దీనికి తోడు తండ్రి రాజశేఖర్ రెడ్డి చరిష్మా కూడా జగన్ కు బాగా ఉపయోగపడింది.
జగన్ అధికారంలోకి రాగానే ఎన్నికల ముందు ప్రకటించిన అన్ని హామీలు దాదాపు అమలుచేసి చూపించారు.ఒకరకంగా జగన్ పరిపాలన సాహసోపేతంగా సాగిందనే చెప్పాలి.
ఒకవైపు ఏపీకి ఆర్థిక కష్టాలు చుట్టుముట్టినా జగన్ వాటిని లెక్క చేయకుండా ముందుకు వెళ్లారు.
దేశవ్యాప్తంగా జగన్ పరిపాలనకు ప్రశంసలు బాగానే వచ్చాయి.
జగన్ పాలనపై ఎంత సానుకూలత ఉందో, అంతే స్థాయిలో విమర్శలూ వచ్చాయి.జగన్ పరిపాలనలో మొత్తం సంక్షేమ రంగం పైనే దృష్టి పెట్టి, మిగతా అన్ని రంగాలను పక్కన పెట్టేశారు అనే అభిప్రాయం జనాల్లోనూ ఉంది.
ముఖ్యంగా జగన్ తనకు అధికారం తెచ్చిపెట్టింది నవరత్నాలు పథకం అని గట్టిగా నమ్మారు.ప్రజలకు నవరత్నాలు అమలు చేస్తే సరిపోతుందని, ఇంకా ఏం చేసినా చేయకపోయినా పెద్దగా పట్టించుకోరు అని నమ్మరు.
అందుకే వాటి అమలులో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, రాజీ పడలేదు.
రైతు భరోసా, ఆటో క్యాబ్ డ్రైవర్ల కు పదివేల రూపాయలు సొమ్ములు, అమ్మ ఒడి అంటూ 15 వేల రూపాయలు, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇలా భారీగానే జగన్ సంక్షేమానికి ఖర్చు పెట్టారు.జగన్ తొలి ఏడాదిలోనే సంక్షేమ పథకాల కోసం సుమారు 80 వేల కోట్లకు పైగా అప్పులు చేశారు.ఇంకా పూర్తిస్థాయిలో అన్ని పథకాలను అమలు చేయాలంటే నిధులు కొరత తీవ్రంగా ఉంది.
మళ్ళీ వాటికోసం అప్పులు చేయాల్సిందే.ఇక జగన్ వివాదాస్పద నిర్ణయాలు చాలానే ఉన్నాయి.
ముఖ్యంగా ఇసుక పాలసీ జగన్ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది.కొత్త ఇసుక పాలసీ తీసుకు వచ్చే ఉద్దేశంతో ఇసుక తవ్వకాలను నిలిపి వేయడం, ఆ తర్వాత వరుసగా వర్షాలు ముంచెత్తడంతో వంటి కారణాల వల్ల సుమారు ఆరు నెలల పాటు ఇసుక కొరత ఏర్పడింది.
దీంతో నిర్మాణ రంగం పూర్తిగా కుదేలయింది.
ఆ ప్రభావం నిర్మాణ రంగానికి సంబంధించిన అన్ని విభాగాల పైన పడింది.దీంతో ఆ రంగంలో పనిచేసే కూలీలపైనా తీవ్రంగా పడింది.మొత్తం ఈ ఎఫెక్ట్ అంతా జగన్ పై పడింది.
ఇక రాజధాని తరలింపు, ఒక సామాజిక వర్గం అధికారులు, నాయకులను టార్గెట్ చేసుకుంటూ జగన్ వ్యవహరించిన ధోరణి, ఇవన్నీ జగన్ ప్రభుత్వానికి అప్రదిష్ట ను తీసుకొచ్చాయి.కోర్టు సైతం జగన్ నిర్ణయాన్ని తప్పుబడుతూ తీర్పు వెలువరించడం ఇలా ఎన్నో అవరోధాలు జగన్ కు మచ్చ తీసుకొచ్చాయి.
జగన్ పరిపాలన గురించి ఇంకా చెప్పాలంటే ఏడాదిలో ఎన్ని సంచలనాల నిర్ణయాలు తీసుకుని ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారో అంతే స్థాయిలో విమర్శలు మూట కట్టుకున్నారు.జగన్ ఏడాది పాలనలో చేస్తాని ఆర్బాటంగా చెప్పినదానికంటే చేయాలసిందే ఎక్కువ మిగిలిపోయింది.
దీనికి కోర్టుల్లో ఎదురుదెబ్బలు కూడా ఒక కారణం కావొచ్చు.