ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం జిల్లా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఎల్జి పాలిమర్స్ పరిశ్రమలో విషవాయువు లీక్ అవడంతో దాదాపుగా తొమ్మిది మంది ప్రాణాలు వదిలారు.ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కలకలం సృష్టించింది.
దీంతో పలువురు ప్రజా సంఘ నాయకులు మరియు కమ్యూనిస్ట్ వాదులు పరిశ్రమ నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.
ఇందులో భాగంగా పరిశ్రమ నుంచి వెలువడిన విషవాయువు కారణంగా మృతి చెందిన మృతుల కుటుంబాలకు దాదాపుగా కోటి రూపాయలు పరిహారంగా చెల్లించాలని ప్రకటన చేశారు.అంతేకాక ఘటనలో గాయపడి ఆసుపత్రిలో రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు చికిత్స చేయించుకునే అవకాశం ఉన్నటువంటి క్షతగాత్రులకు లక్ష రూపాయలు మరియు స్వల్ప గాయాలతో బయటపడిన వారికి 25వేల రూపాయలు పరిహారం అందించనున్నట్లు తెలిపారు.
అంతేగాక ఈ ఘటన ఎలా జరిగిందనే విషయంపై నివేదికను అందజేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అయితే నిద్ర మత్తులో ఉన్నటువంటి ప్రజలు ఈ ఘటన వల్ల ప్రాణాలు కోల్పోవడమేగాక పరిశ్రమ దగ్గరలో ఉన్నటువంటి పర్యావరణం కూడా దెబ్బతిన్నట్లు సమాచారం.
అయితే ఇప్పటివరకూ ఈ ఘటనలో దాదాపుగా తొమ్మిది మందికి పైగా అధికారికంగా చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు.మరోవైపు పరిశ్రమ నిర్వాహకులు సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతోనే ఇంతటి ప్రమాదం జరిగిందని కాబట్టి పరిశ్రమ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కొందరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.