వైసీపీలో ప్రస్తుతం నెలకొన్న అన్ని రాజకీయ పరిణామాలపై జగన్ పూర్తిగా దృష్టి పెట్టారు.ఒకవైపు పార్టీపరంగా, ప్రభుత్వ పరంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు వైసీపీ ఎదుర్కొంటోంది.
ప్రధాన రాజకీయ ప్రత్యర్దులయిన టిడిపి ,జనసేన పార్టీ లు అదే పనిగా ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, జనాల్లో వైసిపి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారు.ప్రభుత్వపరంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ వ్యూహకర్తను మరోసారి జగన్ రంగంలోకి దించిన సంగతి తెలిసిందే.
పార్టీ వ్యవహారాలపై ఇప్పుడు జగన్ ఫోకస్ పెట్టి సమూల మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా ఈ మార్పు విశాఖ నుంచే మొదలు పెట్టాలని జగన్ చూస్తున్నారట.
విశాఖపట్నం ను పరిపాలన రాజధానిగా ప్రకటించిన జగన్ అక్కడ రాజధాని ఏర్పాటుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇక్కడ పార్టీకి, ప్రభుత్వానికి అత్యంత కీలకం కావడంతో, జగన్ తనకు అత్యంత నమ్మకస్తులైన, సన్నిహితులైన ఎంపీ విజయసాయి రెడ్డి కి పూర్తిగా బాధ్యతలు అప్పగించారు.
ఆయన రాజకీయాలను పర్యవేక్షిస్తున్నారు.అయితే గత కొంత కాలంగా వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు జగన్ కు ఇబ్బందికరంగా మారాయి.ముఖ్యంగా విశాఖ లో బలమైన నాయకుడుగా ఉన్న టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు జగన్ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు.అయితే ఆయన మాత్రం వైసీపీ లో చేరలేకపోయారు.
దీనికి ప్రధాన కారణం మంత్రి అవంతి శ్రీనివాసరావు, విజయసాయిరెడ్డి వ్యవహారశైలి కారణం అనేది అందరికీ తెలిసిందే.
గంటా ను చేర్చుకోవడం ద్వారా, విశాఖ రాజకీయాల్లో పట్టు సంపాదించాలని జగన్ చూసినా, దానికి అవంతి, విజయసాయిరెడ్డి బ్రేకులు వేయడంతో, గంటా చేరిక ఆగిపోయింది.ఇవే కాకుండా అనేక విషయాల్లో విజయసాయిరెడ్డి వ్యవహారం పై అనేక విమర్శలు రావడం వంటి వ్యవహారం కారణంగా, జగన్ కాస్త గుర్రుగానే ఉన్నారు.రాజకీయాల్లో పట్టు పెంచుకునేందుకు ఈ వ్యవహారాలు అడ్డం పడుతుండడంతో జగన్ కు కాస్త ఇబ్బందికరంగా మారింది.
అదీ కాకుండా వైసీపీ శ్రేణులు విజయసాయిరెడ్డి వ్యవహారశైలిపై గత కొంతకాలంగా ఆగ్రహం ఉండడం వంటి వ్యవహారాలతో విజయసాయిరెడ్డిని అక్కడి పార్టీ బాధ్యతల నుంచి తప్పించి, ఆ బాధ్యతలను తన చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి కి అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఆయన అయితేనే అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లడంలో సక్సెస్ అవుతారు అని జగన్ భావిస్తున్నారట.