ఏపీ సీఎం జగన్ కు ఒక దాని తర్వాత మరొకటి అన్నట్లుగా వరుసగా ఇబ్బందులు వచ్చి పడుతూనే ఉన్నాయి.తాను పార్టీ పరంగా, ప్రభుత్వపరంగా పారదర్శకతతో ఉంటున్నా, తన తాపత్రయాన్ని పార్టీ శ్రేణులు ఎవరు అర్థం చేసుకోకపోవడంపై కొంతకాలంగా జగన్ ఆగ్రహంగానే ఉన్నారు.
ముఖ్యంగా మంత్రుల వ్యవహారశైలిపై జగన్ కు ఉన్న అసంతృప్తి అంతా ఇంతా కాదు.వారు తమకు అప్పగించిన మంత్రి శాఖలపై పట్టు సంపాదించలేక పోవడం, కొన్ని కొన్ని అవినీతి వ్యవహారాల్లో మునిగి తేలుతూ ఉండడం, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పలేకపోవడం, ఇలా ఎన్నో కారణాలతో, గత కొంత కాలంగా వైసీపీ ప్రభుత్వం అభాసుపాలవుతోంది .ఈ విషయాలపై సదరు మంత్రులను పిలిచి వార్నింగ్ ఇచ్చినా, పరిస్థితిలో మార్పు రాకపోవడం వంటి వ్యవహారాలతో జగన్ విసుగెత్తిపోయారట. దీంతో ప్రస్తుత మంత్రుల్లో ముగ్గురు, నలుగురిని ఉంచి, మిగతా వారిని తప్పించి, వారి స్థానంలో సమర్థులైన వారిని నియమించాలని జగన్ చూస్తున్నారట.
పనితీరు సక్రమంగా లేని వారిని మంత్రులుగా కొనసాగించినా, పెద్దగా ఉపయోగం ఉండదనే అభిప్రాయం లో ఉన్న జగన్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా మంత్రుల పనితీరు పై ఒక అభిప్రాయానికి వచ్చిన జగన్, మంత్రిమండలి ప్రక్షాళన చేయకపోతే, అది పార్టీ ఉనికికే ప్రమాదం అనే ఆలోచనతో ఉన్నారు.
దీంతో జిల్లాలో సామాజిక వర్గాల ఆధారంగా మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని, అది కూడా తొందర్లోనే చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.
ఆయనను టార్గెట్ చేసుకుంటూ టిడిపి సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు అదే పనిగావిమర్శలు చేస్తూ ఉండడం, ఆ విమర్శలకు సరైన సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో జయరాం ఉండడం వంటి వ్యవహారాలు అన్నీ వైసిపికి పెద్ద తలనొప్పిగా మారాయి.ఇదే విధంగా చాలా మంది మంత్రులు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటూ, పార్టీకి ప్రభుత్వానికి తలనొప్పిగా మారడం, వారి విషయాన్ని టీడీపీ హైలెట్ చేసుకుంటోంది.
ఈ వ్యవహారాలను దృష్టిలో పెట్టుకుని జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదటి మంత్రివర్గ విస్తరణలో జగన్ సామాజిక వర్గాల సమతూకం పాటించి, తనకు అత్యంత సన్నిహితులైన వారిని సైతం పక్కన పెట్టారు. ఎంతోమంది జగన్ తాపత్రయం అర్థం చేసుకుని మంత్రిపదవులు రాకపోయినా, జగన్ ను సమర్థిస్తూనే వస్తున్నారు.అటువంటి వారిని పక్కనపెట్టి ఏరి కోరి తీసుకు వచ్చిన మంత్రులు తన అభీష్టం మేరకు నడుచుకోకపోవడం వంటి పరిణామాలను జగన్ సీరియస్ గా తీసుకుని మరింత నష్టం జరగకముందే మంత్రి మండలిని ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
అతి తొందర్లోనే దీనికి సంబంధించి కసరత్తు మొదలు అయ్యే అవకాశం కనిపిస్తోంది.