తాను పూర్తిగా ప్రభుత్వ వ్యవహారాల్లో మునిగి పోతుండడం, పార్టీని పట్టించుకునే తీరిక లేకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి కాస్త అదుపుతప్పినట్లుగా కనిపిస్తోందనే అభిప్రాయం ఆ పార్టీ అధినేత జగన్ లో వ్యక్తమవుతోంది.ముఖ్యంగా ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు గతం కంటే ఇప్పుడు తీవ్రమయ్యాయి.
కొత్తగా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరుతున్న నాయకులకు, మొదటి నుంచి వైసీపీ లో ఉంటున్న నాయకులకు మధ్య ఆధిపత్య పోరు తీవ్రంగా ఉండడం, ఒకరి వ్యవహారాల్లో మరొకరు కలుగ చేసుకుంటూ, పార్టీని పూర్తిగా పక్కన పెట్టేసినట్టుగా వ్యవహరిస్తుండడం ఇవన్నీ జగన్ కు చాలాకాలంగా అసహనం కలిగిస్తున్నాయి.
ఈ వ్యవహారాలపై దృష్టి పెట్టాలంటూ పార్టీలోని కీలక నాయకులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నా, పరస్థితుల్లో మార్పు రాకపోవడం వంటివి లెక్కలు వేసుకుంటున్న జగన్ ఇక ఈ నిర్లక్ష్యాన్ని ఉపేక్షించకూడదు అని, పార్టీకి చేటు తెచ్చే విధంగా గ్రూపు రాజకీయాలకు పాల్పడుతూ, పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్న నాయకుల వ్యవహారంపై సీరియస్ గా దృష్టి పెట్టాలని, అవసరమైతే వారిపై సస్పెన్షన్ వేటు వేయాలనే నిర్ణయానికి జగన్ వచ్చినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం టిడిపి, బిజెపి, జనసేన ఇలా అంతా మూకుమ్మడిగా ప్రభుత్వం పై దాడి చేస్తూ, అనేక విమర్శలు చేస్తున్న క్రమంలో, పార్టీ నేతల వ్యవహార శైలి కారణంగా మరిన్ని తలనొప్పులు వస్తూ ఉండడం వంటి విషయాలపై జగన్ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.
ఇక కొంతమంది మంత్రులు వ్యవహారశైలిపైనా, జగన్ ఆగ్రహం గా ఉన్నారట.
ఎంత చెప్పినా వారు తమ పద్ధతిని మార్చుకోకపోవడంతో, వారికి సంబంధించిన శాఖల్లో అవినీతికి పాల్పడుతుండడం, మరికొంత మంది ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేస్తూ తరచుగా వివాదాస్పదం అవుతుండటం వంటి విషయాలపై ఇప్పటికే అనేకసార్లు హెచ్చరించినా, వారిలో మార్పు రాకపోవడంతో, అవసరమైతే వారిని తప్పించి, ఆ స్థానంలో మరి కొందరికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారట.
ఇప్పటికే మంత్రులు, పార్టీ నాయకుల వ్యవహార శైలిపై నిఘా ఏర్పాటు చేయడమే కాకుండా, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనే నివేదికలు తరచుగా జగన్ తెప్పించుకుంటూ అన్ని విషయాలను ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు.
ఇప్పుడు పరిస్థితులు చేయి దాటి పోతున్నట్టుగా కనిపిస్తుండడంతో ఇప్పుడు పార్టీ ప్రక్షాళనకు జగన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.