చాలా కాలంగా ఏపీ అధికార ప్రతినిధి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు గ్రూపు రాజకీయాలు షరా మామూలుగా మారిపోయాయి.ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించిన క్రమంలో బహిరంగంగానే విమర్శలకు దిగుతుండడం వంటి వ్యవహారాలు ఆ పార్టీని కలవరానికి గురిచేస్తున్నాయి.
తాజాగా తూర్పు గోదావరి జిల్లా డి ఆర్ సి సమావేశంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్- కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మధ్య వివాదం చెలరేగడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వంటి వ్యవహారాలు మీడియాలో హైలెట్ అయ్యాయి.
టిడ్కో ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పగానే , తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ద్వారంపూడి ఇద్దరం ఒకే పార్టీలో ఉన్నామని , ఈ విషయాన్ని ముందుగా తనకు ఎందుకు తెలియజేయలేదు అంటూ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫై ఆగ్రహం వ్యక్తం చేయడం, మరో అంశం లోనూ ఇదే రకంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడడం, దానికి ద్వారంపూడి అభ్యంతరం వ్యక్తం చేయడం ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడం వంటి వ్యవహారాలు వైసీపీకి బాగా డ్యామేజ్ తీసుకొచ్చాయి.
దీంతో వారిద్దరి మధ్య వివాదం వ్యవహారం పై ఆరా తీసిన ఏపీ సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే వారిని తాడేపల్లిలోని సిఎం కార్యాలయానికి పిలిపించి గట్టిగా క్లాస్ పీకినట్లు వైసిపి వర్గాలు పేర్కొంటున్నాయి.
అధికార పార్టీ నేతలు ఒకరిపై ఒకరు ఇలా వ్యవహరించడం, పార్టీకి తీరని నష్టం చేకూరుస్తుందని, ఈ వ్యవహారాలు ఇక్కడితో ఆగిపోవని ఎక్కడికక్కడ నాయకులు ఇదే వైఖరితో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేందుకు ప్రయత్నిస్తారని వైసిపి ఆందోళన చెందుతోంది.కేవలం ఈ ఇద్దరు నేతలే కాకుండా , మిగిలిన ప్రాంతాల్లోనూ నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలు పెరుగుతున్న అంశంపై వైసిపి దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.
ఎక్కడికక్కడ ఈ వివాదాలను సద్దుమణిగేలా చేయకపోతే, పార్టీ తీరని ఇబ్బందుల్లో పడుతుందనే ఆందోళనలో వైసిపి వర్గాలు ఉన్నాయి.అందుకే తూర్పు లో నెలకొన్న వివాదాన్ని వెంటనే పరిష్కరించే దిశగా జగన్ అడుగులు వేసినట్టుగా కనిపిస్తున్నారు.
మిగిలిన అన్ని నియోజక వర్గాలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.