తమ చేతికి మట్టి అంటకుండా, తమ రాజకీయ శత్రువును దెబ్బ తీయడం ఎలాగో వైసీపీ అధినేత జగన్ ను చూసి తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందే.తనపైన, తమ పార్టీ నాయకుల పైన, అదేపనిగా విమర్శలు చేస్తూ, అభాసుపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న రాజకీయ ప్రత్యర్థులు అందరి విషయంలోనూ జగన్ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తూ వస్తున్నారు.
ఎక్కడా తొందరపడకుండా, అందరి అవినీతి వ్యవహారాలకు సంబంధించిన ఆధారాలను పక్కాగా సిద్ధం చేసుకునే జగన్ ముందుకు కదులుతున్నారు.తొందరపడి ముందుకు వెళ్తే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వారిని జైలుపాలు చేశారు అని చెప్పుకోవడానికి లేకుండా వారి వ్యవహారాలకు సంబంధించిన ఆధారాలను బయటపెడుతోంది.
ఈ తరహా రాజకీయం జగన్ కు బాగానే వర్కవుట్ అవుతోంది.
ఇదిలా ఉండగా టీడీపీలో పెద్ద తలకాయ అయిన చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పైన పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చినా, దానికి తగిన ఆధారాలు ఉన్నా, జగన్ మాత్రం ఎక్కడా తొందరపడలేదు.
ఆ ఆధారాలతో వారిపై విచారణ చేయించి అరెస్టు చేయించే అవకాశం ఉన్నా, జగన్ మాత్రం ఆ విధంగా చేయడం లేదు.అలా చేస్తే తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్లి ఏపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది అనే విషయం జగన్ కు బాగా తెలుసు.
అందుకే, వారి అవినీతి వ్యవహారాలపై విచారణ జరగాలి.అరెస్టు అవ్వాలి.కానీ తమ ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగిపోవాలి అనే ఉద్దేశంలో ఉన్న జగన్ ఇప్పుడు ఆ వ్యవహారాల్లోకి కేంద్రాన్ని తెలివిగా లాగుతున్నారు.
వైసీపీతో పొత్తు పెట్టుకునేందుకు తహతహలాడుతున్న బీజేపీని ఇప్పుడు తమ వైపు తిప్పుకుని, తన రాజకీయ శత్రువుల అందరిపైనా కక్ష తీర్చుకునే పనిలో జగన్ ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.ఇప్పటికే వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజ బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించి సిబిఐ రంగంలోకి దిగి విస్తృతంగా సోదాలు చేస్తోంది.ఇప్పటి వరకు తమకు కంటిలో నలుసుగా మారిన రఘురామకృష్ణంరాజు దాడుల తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోతారని, తమకు పెద్దగా ఇబ్బంది ఉండదని వైసీపీ భావిస్తోంది.
ఇక్కడైతే ఆగేది లేదని, చంద్రబాబు అవినీతి వ్యవహారాలపైనే విచారణ చేయించి వారిని దోషులుగా నిరూపించేందుకు, కేంద్రాన్ని రంగంలోకి దించాలని, కేంద్రం ఆదేశాలతోనే వారి అవినీతి వ్యవహారాలపై దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చాలని చూస్తున్నారు.
టీడీపీ తమపై ఎదురు దాడి చేయలేదని, అసలే బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతున్న తెలుగుదేశం పార్టీ బీజేపీపై విమర్శలు చేస్తే, ఆ రెండు పార్టీల మధ్య యుద్ధం మొదలు అవుతుందని, మరింతగా టిడిపిని ఎదుర్కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందనే అభిప్రాయంలో జగన్ ఉన్నారు.కేంద్రం ద్వారా, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఏపీలోకి దించి తమ రాజకీయ శత్రువుల అందరిని భయపెట్టే విధంగా వ్యవహారం చేయబోతున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి.