సాధారణంగా సినిమా సెలబ్రిటీలు అంటే వారికి ఎంతో మంది అభిమానులు ఉంటారు.వారికి నచ్చిన హీరో హీరోయిన్ల సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే అభిమానులు చేసే హంగామా మాటల్లో చెప్పలేనిది.
సినిమా విడుదల అవుతుందంటే ఆ హీరో భారీ కటౌట్ లను థియేటర్ల ముందు పెట్టీ పూలదండలు పాలాభిషేకాలు కొబ్బరికాయలు కొడుతూ వారి అభిమానాన్ని చాటుకుంటారు.అయితే ఈ విధంగా హీరోల పట్ల అభిమానాన్ని చూపడంలో తమిళులు కాస్త ముందంజలో ఉంటారు.
సినీ తారల పట్ల తమిళ ప్రజలు చూపించే అభిమానం చెప్పలేనిది.ఇప్పటికే తమిళనాడులో తమ అభిమాన హీరో సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే సినిమా బాక్సులను ఊరేగిస్తూ తీసుకువెళ్తారు.
ఈ విధంగా అభిమానులు తమ అభిమాన హీరో హీరోయిన్ల పట్ల చూపే అభిమానం కొన్నిసార్లు ఆనందం వేసిన మరికొన్ని సందర్భాలలో చిరాకు తెప్పిస్తుంది.తాజాగా తమిళనాడుకు చెందిన కొందరు రజనీ అభిమానులు రజనీకాంత్ పై ఉన్న అభిమానాన్ని విభిన్న శైలిలో చూపించడంతో నెటిజన్లు పెద్దఎత్తున వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రజనీకాంత్ నటించిన అన్నాత్తే ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తాజాగా ఈ సినిమా నుండి చిత్ర బృందం మోషన్ పోస్టర్ విడుదల చేయడంతో అభిమానులు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు సీనియర్ తారలు ఖుష్బూ, మీనా నేటి హీరోయిన్ నయనతార, కీర్తి సురేష్ నటించనున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన మోషన్ పోస్టర్ ను రజనీకాంత్ బైక్ పై కూర్చొని చేతిలో రాడ్ పట్టుకుని స్టైలిష్ లుక్ లో కనిపించారు.మోషన్ పోస్టర్ తో పాటు మరొక పోస్టర్ కూడా విడుదల చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఈ క్రమంలోనే రజనీకాంత్ పోస్టర్ కి దండేసి దండం పెట్టుకొని ఏకంగా ఒక మేకపోతును తలనరికి ఆ రక్తంతో రజనీకాంత్ పాదాలకు అభిషేకం చేశారు.
ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో జంతు ప్రేమికులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయంపై జంతు ప్రేమికురాలైన తెలుగు యాంకర్ రష్మి గౌతమ్ స్పందిస్తూ… ఏ హీరో కూడా ఈ విధమైనటువంటి రాక్షస అభిమానాన్ని పొందాలని కోరుకోడు ఇలాంటి రాక్షసత్వం పనులతో హీరోల పేరును చెడగొట్టకండి అంటూ రష్మి గౌతమ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశారు.