ఎట్టకేలకు అందరూ ఊహించినట్టుగానే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఢిల్లీ ఫ్లైట్ నిన్న రాత్రి ఎక్కేసారు.ఈరోజు బిజెపి కేంద్ర పెద్దలతో ఆయన భేటీ కాబోతున్నారు.
ఇప్పటికే బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కూడా ఆయనకు దక్కడంతో ఏ విషయాల పై చర్చిస్తారు ? ఏ హామీలు తీసుకుని ఆయన బీజేపీలో చేరతారు అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది రాజేందర్ తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఈటెల వెంట ఉన్నారు.గతకొద్దిరోజులుగా రాజేందర్ సొంత పార్టీ పెడతారనే ప్రచారం ఒక వైపు జరుగుతుండగా, బిజెపి లోనూ ఆయన చేరబోతున్నారనే హడావుడి నడుస్తుంది.
కానీ రాజేందర్ మాత్రం ఏ విషయం పైన స్పష్టత ఇవ్వకుండానే అందర్నీ సస్పెన్స్ లో పెట్టారు.
అయితే ప్రస్తుతం టిఆర్ఎస్ ప్రభుత్వం రాజేందర్ ను పూర్తి స్థాయిలో టార్గెట్ చేసుకుని ఆయన ఆర్ధిక వ్యవహారాలపైనా, ఆస్తులకు సంబంధించి అనేక విషయాల పైన టార్గెట్ పెట్టడం తదితర అంశాలతో రానున్న రోజుల్లో టిఆర్ఎస్ నుంచి మరింత ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని గ్రహించిన రాజేందర్ ప్రస్తుత తరుణంలో సొంత పార్టీ పెట్టి ఇబ్బందులు ఎదుర్కొనే కంటే కేంద్ర అధికార బీజేపీ లో చేరితే అన్ని రకాలుగానూ అండదండలు ఉంటాయనే ఉద్దేశంతో బిజెపి వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.
బీజేపీ లో చేరితే రాజ్యసభ సభ్యత్వం తో పాటు , కేంద్ర మంత్రి పదవి, అలాగే రాజేందర్ భార్య కు హుజురాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపుతోందని వార్తల నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.రాజేందర్ తో పాటు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఆయన వెంట వెళ్లారు.
ఈరోజు బిజెపి పెద్దలను కలిసిన తర్వాత తన రాజకీయ భవిష్యత్తు పైనా, బిజెపిలో చేరే విషయం లోనూ రాజేందర్ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.టిఆర్ఎస్ లో మొదటి నుంచి కీలకంగా వ్యవహరించిన రాజేందర్ ఉద్యమకాలం నుంచి ఆ పార్టీలో పనిచేయడం కెసిఆర్ స్థాయిలో తెలంగాణ లో ఆయన ప్రభావం ఎక్కువగా ఉందని బిజెపి నమ్ముతోంది.అందుకే రాజేందర్ కు అంత ప్రాధాన్యం ఇచ్చి మరీ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు గా కనిపిస్తోంది.