ఎన్నికల సమయం ముంచుకొస్తున్న తరుణంలో రాజకీయ ప్రతీకారాలు పార్టీల మధ్య ఎక్కువయ్యాయి.ఒక పార్టీని తొక్కాలని మరో పార్టీ అనేక ఎత్తుగడలు వేస్తున్నాయి.
ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో టీడీపీని అధికారంలోకి రానివ్వకుండా అనేక ఎత్తుగడలు వేస్తోంది.ముఖ్యంగా టీడీపీకి ఆర్ధికంగా వెన్నుదన్నుగా ఉన్న బలమైన నాయకులే టార్గెట్ గా కొంతకాలంగా ఐటీ , ఈడీ ల ద్వారా వారి ఆస్తులపై విచారణ పేరుతో కొంతకాలంగా ఏపీలో హడావుడి జరుగుతూనే ఉంది.
ఇప్పటివరకు ఐటీ , ఈడీ దాడులన్నీ టీడీపీ అధినేత చంద్రబాబు కి సన్నిహితంగా ఉన్నవారే టార్గెట్ గా జరిగాయి.తాజాగా ఈ రోజు జరిగిన ఐటీ దాడులు టీడీపీ లో కలవరం పుట్టిస్తున్నాయి.
ముందుగా కడప జిల్లా టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆస్తులపై ఐటీ శాఖ దాడులకు దిగింది.ఆయనకు చెందిన కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి.ఈరోజు తెల్లవారు జామునుంచే ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి.హైదరాబాద్, కడపలలో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తి గ్రామంలోని ఆ స్వగ్రహంలోనూ సోదాలు ప్రారంభమయ్యాయి.ప్రస్తుతం సీఎం రమేష్ ఢిల్లీలో ఉన్నారు.
టీడీపీ అధికారంలోకి రాగానే నాలుగేళ్ళ క్రితం వరకూ సిఎం రమేష్ ప్రాజెక్టులు ఆర్ధికంగా పెద్ద చెప్పుకోదగ్గ స్ధాయిలో లేవు.ఎప్పుడైతే టిడిపి అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి రమేష్ ప్రాజెక్టులు ఒక్కసారిగా పుంజుకున్నాయి.
ప్రధానంగా రాయలసీమలోని గాలేరు-నగిరి, హంద్రీ-నీవా, వంశధార ఇరిగేషన్ తదితర ప్రాజెక్టుల పనులు చేస్తున్నారు. సిఎం రమేష్ పై ఉన్న ప్రధానమైన ఆరోపణలేమిటంటే, అప్పటి వరకూ ఉన్న ప్రాజెక్టల అంచనాలను పెంచేసి డబ్బులు చేసుకున్నారనేది.
ఇదే విషయమై బిజెపిలోని రాయలసీమ నేతలు కొందరు ప్రత్యేకంగా క్షేత్రస్ధాయి పరిశీలన జరిపారు.
ప్రాజెక్టుల పనులు జరుగుతున్న తీరు, వాస్తవ అంచనాలు, చెల్లించిన బిల్లులు, పెండింగ్ లో ఉన్న పనులు, బిల్లులు లాంటి అన్ని విషయాలపైనా పూర్తి సమాచారం సేకరించారు.ప్రాజెక్టుల ముసుగులో భారీ అవినీతి జరుగుతోందనే నిర్ధారణకు వచ్చారు.ఉక్కు ఫ్యాకర్టీ గురించి తాను ఉద్యమం చేస్తున్నందునే కేంద్రం కక్ష కట్టి తనపై ఐటీ దాడులు చేయిస్తుందని సీఎం రమేష్ ఆరోపిస్తున్నారు.
ఐటీ దాడులు ఇంకా కొనసాగుతున్నందున పూర్తి వివరాలు బయటకి రాలేదు.