భారీ వర్షాలతో , వరదలతో చెన్నై మహా నగరం సర్వ నాశనమైన పరిస్థితి మన దేశ ప్రజలనే కాదు ప్రపంచ దేశాలనే ఆందోళన పరుస్తోంది.ఒక మహానగరం ఇంత భారీగా దెబ్బతినడం గత కొన్నేళ్లలో దేశంలో ఎక్కడా చూడలేదు.
ఈ నగరంలో అన్ని రకాల సంస్థలూ సర్వ నాశనం అయ్యాయి.వేల కోట్ల రూపాయల మేరకు నష్టపోయాయి.
ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనైనా ఆయువు పట్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ ) రంగమే.ఆ రంగం ఇక్కడ పూర్తిగా దెబ్బ తిన్నది.
ఈ కంపెనీలు కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది.ఈ సంస్థలు తమ కార్యకలాపాలను చెన్నైకి దగ్గరగా ఉన్న ఎపీలోని తిరుపతి నుంచి ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
చెన్నైకి తిరుపతి దగ్గరగా ఉండటమే కాకుండా అన్ని సౌకర్యాలు ఉన్నాయి.తిరుపతిలో ఐటీ కార్యకలాపాలు ప్రారంభించినందువల్ల ఏపీలో కూడా విస్తరించవచ్చని ఐటీ సంస్థలు భావిస్తున్నాయి.
ప్రభుత్వానికి, ప్రైవేటు సంస్థలకు, విశ్వవిద్యాలయాలకు, టీటీడీకి సేవలు అందించవచ్చని అనుకుంటున్నాయి.ఏపీలో ఇంకా అనేక కొత్త సంస్థలు రాబోతున్నాయి కాబట్టి తిరుపతిలో ఐటీ సంస్థలను పెట్టడం లాభాదాయకమవుతుంది.
ఐటీ కంపెనీలకు తిరుపతి తగిన నగరమని ఆ రంగంలోని నిపుణులు భావిస్తున్నారు.ఇక్కడ ఐటీ నిపుణులు కూడా ఎక్కువమంది ఉన్నారు.
తిరుపతికి చెన్నై , బెంగళూరు నగరాలు దగ్గర కాబట్టి అవసరమైన నిపుణులను రప్పించడం సులభం.తిరుపతిలో, చుట్టుపక్కల రాయలసీమ జిల్లాల్లో అనేక ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి.
కాబట్టి వారికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది.ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం కాబట్టి పన్ను రాయితీలు వచ్చే అవకాశం ఉంటుంది.