టీడీపీ అధినేత చంద్రబాబు పరోక్షంగా తెలంగాణ రాజకీయాలను వదిలి పెట్టేశారు.ఏదో నామమాత్రంగానే స్థానిక నాయకుల ద్వారా వ్యవహారాలను చక్కబెట్టేస్తున్నారు.
పూర్తిగాఆయన ఏపీ రాజకీయాలపైనే దృష్టి సారించారు.తెలంగాణలో ఎంత పోరాటం చేసినా టిడిపి పుంజుకునే అవకాశం లేదని, తమ పార్టీపై ఆంధ్ర ముద్ర ఎలాగూ ఉంటుంది కాబట్టి బాబు పెద్దగా ఇక్కడ వ్యవహారాలను పట్టించుకోవడం మానేశారు.
అయితే పార్టీలో ఉన్న కీలక నాయకులను వివిధ పార్టీల్లో చేర్పించి, అక్కడ విషయాలను తెలుసుకుంటారు అనే విమర్శలు ఆయనపై ఉన్నాయి.ఈ విధంగానే రేవంత్ రెడ్డి ని చంద్రబాబు స్వయంగా కాంగ్రెస్ లోకి వెళ్లేలా ప్రోత్సహించారని, ఆయన పిసిసి అధ్యక్ష పదవి దక్కించుకునే విషయంలోనూ బాబు పాత్ర ఉందనే విమర్శలు వస్తూనే ఉన్నాయి.
అంతేకాకుండా టీడీపీ కి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితరులు బీజేపీలో చేరడం వెనక బాబు ఉన్నారని వైసిపి నాయకులు విమర్శలు చేస్తూనే ఉంటారు.తాజాగా టిడిపి సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొంది, దాదాపు 30 ఏళ్ల నుంచి ఆ పార్టీతో అనుబంధం పెంచుకున్న కరీంనగర్ జిల్లాకు చెందిన ఎల్.రమణ టిడిపి అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేశారు.తాజాగా ఆయన టిఆర్ఎస్ లో చేరిపోయారు.
అయితే రమణ టిఆర్ఎస్ లోకి వెళ్లే విధంగా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించార ని, ఆయన ప్రోద్బలంతోనే రమణ టిఆర్ఎస్ లో చేరారు అనే విమర్శలను తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు.
రేవంత్ చంద్రబాబు మనిషి అంటూ టిఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్న క్రమంలో రమణ కూడా చంద్రబాబు మనిషి అంటూ కాంగ్రెస్ విమర్శలు మొదలు పెట్టింది.దీంతో నిజంగానే రమణను చంద్రబాబు టిఆర్ఎస్ లోకి వెళ్లేలా ప్రోత్సహించారా ? రమణ ద్వారా టిఆర్ఎస్ కి సంబంధించిన కీలక విషయాలను తెలుసుకోబోయే ప్రయత్నాల్లో ఉన్నారా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి.