తమిళప్రజల గుండెల్లో తలైవి గా నిలిచిన దివంగత నటి, అన్నాడీఎంకే నేత, సీఎం జయలలిత నెచ్చలి శశికళ అలియాస్ చిన్నమ్మ కు ఐటీ అధికారులు గట్టి ఝలక్ ఇచ్చారు.అవినీతి ఆరోపణలు ఎదురుకొంటున్న శశికళ గత కొంత కాలంగా జైలు లోనే శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే.2017లో అక్రమాస్తుల కేసులో శశికళకు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్షను విధించడం తో అప్పటి నుంచి ఆమె బెంగుళూరు లోనే జైలు శిక్ష అనుభవిస్తున్నారు.అయితే తాజాగా ఆమె పేరు తో ఉన్న ఆస్తులను దాదాపు రూ.300 కోట్ల మేరకు అటాచ్ చేస్తున్నట్లు ఐటీ అధికారులు పేర్కొన్నారు.వివిధ ప్రాంతాల్లో ఉన్న బోగస్ కంపెనీలను గుర్తించి వాటిపై కొరడా ఝళిపించిన అధికారులు, పెద్ద నోట్ల రద్దు సమయంలో కూడా రూ.1674 కోట్ల విలువైన స్థిరాస్తుల కొనుగోళ్లకు సంబంధించి బంధువులకు లేఖ కూడా రాయడం తో ఇప్పుడు డొంక అంతా కదిలింది.దీనితో తాజాగా ఆమెకు చెందిన దాదాపు 65 ఆస్తులను అటాచ్ చేసినట్లు తెలుస్తుంది.వీటిలో పోయస్గార్డెన్ దగ్గర ఉన్న 10 అంతస్తుల ఇల్లు కూడా ఒకటి ఉంది.2003-05 మధ్య కాలంలో శశికళ 200 ఎకరాలను కొనుగోలు చేసినట్లు తేల్చారు.
షెల్ కంపెనీలతో శశికళ భారీగా ఆస్తులు కూడాబెట్టారని, వాటిని అటాచ్ చేస్తున్నామని కూడా ఐటీ అధికారులు పేర్కొన్నారు.అంతేకాకుండా హైదరాబాద్లోని బంజారాహిల్స్ కేంద్రంగా ఈ షెల్ కంపెనీ ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు కూడా నిర్వహించినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది.
మొత్తానికి శశికళ అక్రమాస్తులపై కన్నేసిన ఐటీ అధికారులు తాజాగా ఆమెకు సంబందించిన 65 ఆస్తులను అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.