వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ రాబోయే ఎన్నికలపై గంపెడు ఆశలతో ఉన్నాడు.అసలే ఒకసారి ఎన్నికల బరిలో ఓటమి చవి చూడడంతో ఈసారి ఎన్నికల్లో ఎలా అయినా విజయం సాధించాలని జగన్ చూస్తున్నాడు.
అందుకే తన బలం అంతా కూడగట్టుకుని మరీ కష్టపడుతున్నాడు.అయితే అధికార పార్టీ టీడీపీ ని ఎదుర్కోవడం వైసీపీ కి అనుకున్నంత సులువు కాదు.
దీనికి తోడు సినీ గ్లామర్ తో ఎన్నికల బరిలోకి దిగబోతున్న పవన్ ని కూడా ఎదుర్కోవడం జగన్ కి సవాలే.కానీ జగన్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు బాగా కలిసివస్తుందని భారీగా ఆశలు పెట్టుకున్నాడు.
ఏపీలో ముక్కోణపు పోటీ తీవ్రంగా ఉండబోతోంది.ఈ దశలో జగన్ వంటి కీలక నాయకులు ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై ఆధారపడడం మాత్రం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు వస్తాయో చెప్పడం కష్టం.నిన్న మొన్నటి వరకు చంద్రబాబు అనుభవజ్ఞుడని, అందుకే ఆయనకు అవకాశం ఇచ్చానని, మద్దతిచ్చానని గెలిపించానని చెపుకొన్నారు పవన్.
ఆ తరువాత టీడీపీ ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ తానే సీఎం అవ్వబోతున్నట్టు పవన్ ప్రకటించుకుంటున్నాడు.
ఇక జగన్ విషయానికి వస్తే.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు తనను గెలిపిస్తుందని బాగా ఆశలు పెట్టుకున్న ఆయన బాబు ప్రభుత్వం ఏం చేసినా దానిలోని లోపాలను వెతికేందుకు, వాటిని ప్రచారం చేసేందుకు ఆయన తన మీడియాను బాగా వాడుకుంటున్నారు.కానీ ఈ వ్యతిరేకత జగన్ కు అనుకూలించే అవకాశం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే బాబు రాజకీయ అనుభవం ముందు జగన్ నిలబడగలుగుతాడా అనేది పెద్ద సందేహంగా ఉంది.
ఎందుకంటే.జగన్ కన్నా ముందుగానే బాబు ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాడు.అందుకే టీడీపీ కి ఆజన్మ విరోధి అయిన కాంగ్రెస్ పార్టీతో బాబు అంతర్గత పొత్తు పెట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలేలా చేసి జగన్ కు దెబ్బకొట్టి తాను లాభపడాలనుకుంటున్నాడు.
ఈ దశలో ఆ ఓట్లమీద ఆశలు పెట్టుకున్న జగన్ కు నిరాశే మిగిలేలా కనిపిస్తోంది.