టిడిపి 2014 అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిని రాజధాని గా తీర్మానిస్తూ , పెద్ద ఎత్తున భూములను రైతుల నుంచి తీసుకుని అమరావతి పేరుతో రాజధాని నిర్మాణం మొదలు పెట్టారు .ఇక అప్పటి నుంచి అమరావతిని రాజధానిగా ఒప్పుకునేది లేదు అంటూ వైసీపీ ఎన్నో పోరాటాలు చేసింది .
అయినా అప్పటి సీఎం చంద్రబాబు అమరావతి ని రాజధానిగా ఫిక్స్ చేసేసారు.కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ అమరావతి ని పూర్తిగా పక్కన పెట్టారు .మూడు రాజధానులు అంటూ కొత్త బిల్లును తీసుకువచ్చారు.అయితే ఇది కోర్టులో ఇంకా పెండింగ్ లో ఉండటం, రాజకీయంగా రచ్చ జరుగుతూ ఉండడంతో, కొద్ది రోజుల క్రితమే అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును రద్దు చేస్తున్నామంటూ జగన్ ప్రకటించారు.
అసలు అమరావతిని రాజధానిగా ఒప్పుకోం అంటూ మొన్నటి వరకు భీష్మించుకుని కూర్చున్న జగన్ ఇంత ఆకస్మాత్తుగా మూడు రాజధానుల బిల్లు రద్దు చేసుకోవడం ఏమిటి అనేది ఎవరికీ అంతుపట్టలేదు.అయితే ఇప్పుడు తాము వెనక్కి తగ్గింది తాత్కాలికమేనని, మళ్లీ కొత్త చట్టాలు తీసుకువస్తామని జగన్ చెప్పినప్పటికీ , అది ఏ విధంగా చేస్తారు అనేది క్లారిటీ లేకుండా మారింది.
అసలు జగన్ ప్లాన్ ఏంటనేది మంత్రులు ఎమ్మెల్యేలకు సైతం అంతుపట్టని విధంగా ఉంది.అందరి సలహాలు, సూచనలు , అభిప్రాయాలు తీసుకుని కొత్త బిల్లులో మార్పులు చేర్పులు తీసుకొస్తాము అంటూ జగన్ చెప్పారు .
అయితే అది ఏ విధంగా చేస్తారు అనేది క్లారిటీ లేదు.వచ్చే సెప్టెంబర్ నాటికి కొత్త బిల్లును ప్రవేశపెట్టాలని జగన్ ప్లాన్ చేసుకుంటున్నారు .ఈ మేరకు ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చూస్తున్నారు.దీంతో పాటు తీర్మానాల అంశాన్ని పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తికావడంతో ఎం పి టి సి , జెడ్ పి టి సి, మున్సిపల్ కార్పొరేషన్ అన్ని చోట్ల వైసిపి విజయం సాధించింది.కేవలం కొన్ని స్థానాల్లో టిడిపి, జనసేన విజయం సాధించినా, వైసిపి కే మెజారిటీ స్థానాలు దక్కాయి.
దీంతో గెలిచిన పంచాయతీలు, కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు అన్నిచోట్ల నుంచి మూడు రాజధానుల కు అనుకూలంగా తీర్మానాలు చేయించి, మూడు రాజధానుల విషయంలో ప్రజల్లో సానుకూలత ఉంది అనే విషయాన్ని నిరూపించుకునేందుకు జగన్ ప్లాన్ చేసుకుంటున్నాడట.ఈ తీర్మానం ద్వారా కోర్టులోనూ ఇబ్బందులు ఉండవు అనేది జగన్ అభిప్రాయంగా తెలుస్తోంది.