ఎట్టి పరిస్థితుల్లోనైనా క్యాబినెట్ మీటింగ్ పెట్టి తీరాల్సిందే అంటూ పంతం పట్టిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చివరకి ఆ పంతం నెగ్గించుకున్నాడు.ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా అనుమతి తెచ్చుకున్నాడు.
మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది.మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసేందుకు ఎటువంటి అభ్యంతరంలేదని, సమయం చాలా తక్కువగా ఉన్నప్పటికీ మంత్రులకు ఫోన్ చేసి పిలిపించొచ్చని సీఎం కార్యాలయం భావిస్తోంది.
కేబినెట్ సమావేశం ఉంటే సంబంధితల శాఖల అధికారులతోపాటు ఇతర శాఖలకు చెందిన అత్యవసర విషయాలు ఏవైనా ఉంటే టేబుల్ ఎజెండాగా చేర్చి ఆమోదించవచ్చని ప్రభుత్వంలోని కొంతమంది భావిస్తున్నారు.
కరవు, ఫణి తుఫాను, మంచినీటి సరఫరా, ఉపాధి పనులను సమీక్షించేందుకే కేబినెట్ మీటింగ్ పరిమితం కావాలని ఈసీ మార్గదర్శకాలు కూడా ఇచ్చింది.
కొత్త నిర్ణయాలు, రేట్ల మార్పు, బకాయిల చెల్లింపులు వంటి నిర్ణయాలేవీ ఈ మీటింగ్ లో తీసుకోవడానికి వీల్లేదని స్పష్టంగా పేర్కొంది.అంతే కాకుండా కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను ఈసీ అనుమతి పొందాక మాత్రమే అమలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా పేర్కొంది.
అలాగే కేబినెట్ మీటింగ్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టకూడదని కూడా ఆదేశాలు జారీ చేసింది.ఈ మీటింగ్ కి అనుమతి రావడంపై టీడీపీలో ఆనందం వ్యక్తం అవుతుండగా వైసీపీ మాత్రం యధావిధిగా ఆరోపణలు చేస్తోంది.
చంద్రబాబు ఇంత హడావుడిగా క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నది ప్రజా సమస్యల పరిష్కారానికి కాదని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపణలు చేస్తోంది.పోలవరం ప్రాజెక్టు పనులను నిర్వహిస్తు్న్న టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంస్థ ట్రాన్స్ట్రాయ్ కి అక్రమంగా రూ.400 కోట్లు చెల్లించేందుకే కేబినెట్ సమావేశం అసలు ఉద్దేశం అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేసారు.పోలవరం ప్రాజెక్టు చెల్లింపులన్నీ నిలిపివేయాలన్న ఆయన కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత మాత్రమే చెల్లింపులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అయితే క్యాబినెట్ మీటింగ్ లోని ప్రతి అంశం ఎన్నికల సంఘం అనుమతి మేరకే అమలయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వైసీపీ చేస్తున్నది అనవసర రాద్దాంతమే అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.