మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి కారణం బీజేపీనే అని అందరికీ తెలిసిన విషయమే.సీఎంగా ఏక్నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేసినా తెరవెనుక తతంగం నడిపేది దేవేంద్ర ఫడ్నవీస్ అని తెలిసిపోతుంది.
మొత్తానికి శివసేనను రెండుగా చీల్చి బీజేపీ రాజకీయ లబ్ధిని పొందింది.అయితే ఇప్పుడు మహారాష్ట్ర లాంటి రాజకీయమే తమిళనాడులోనూ వస్తుందని బీజేపీ నాయకులు ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడులోనూ షిండే లాంటి నాయకులు పుట్టుకువస్తారంటూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు.మహారాష్ట్రలో శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేపై ఏక్నాథ్ షిండే చేసిన తిరుగుబాటును రాజధర్మంగా అన్నామలై అభివర్ణించారు.
సీఎం స్టాలిన్ త్వరలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టబోతున్నారని, తర్వాత తమిళనాడులో కూడా ఏక్నాథ్ షిండే ఆవిర్భవిస్తారని అన్నామలై జోస్యం చెప్పారు.
మహారాష్ట్రలో బాల్ థాక్రే, తమిళనాడులో కరుణానిధి కుటుంబాల మధ్య సారూప్యతలను వివరిస్తూ బీజేపీ నేత అన్నామలై ఈ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
బాల్ థాక్రే కుమారుడు బిందుమాధవ్ సినిమాల్లోకి వెళ్లారని.తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మొదటి కుమారుడు ముత్తు కూడా అంతేనన్నారు.థాక్రే రెండో కుమారుడు కుటుంబానికి దూరంగా ఉన్నాడని.కరుణానిధి రెండో కుమారుడు అళగిరి కూడా అంతేనని పోలికలను అన్నామలై వివరించారు.థాక్రే మూడో కుమారుడు ఉద్ధవ్ థాక్రే సీఎం అయిన తరహాలోనే కరుణానిధి మూడో కుమారుడు స్టాలిన్ కూడా సీఎం అయ్యారని గుర్తుచేశారు.
అయితే బీజేపీ నేత అన్నామలై వ్యాఖ్యలను డీఎంకే పార్టీ లైట్గా తీసుకుంది.ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం లేదని డీఎంకే సీనియర్ నేత, మాజీ ఎంపీ ఆర్.ఎస్ భారతి స్పష్టం చేశారు.అన్నామలై చేసిన వ్యాఖ్యలను తమ పార్టీ సీరియస్గా తీసుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు.అన్నామలై చెత్త మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.డీఎంకేలో తిరుగుబాటు వచ్చే అవకాశం లేదని ఆర్.ఎస్.భారతి అభిప్రాయపడ్డారు.