మహాకూటమిలో ఇప్పటి వరకు పెద్ద చిక్కుముడిగా ఉన్న సీట్ల పంపకం ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.ఈ వ్యవహారం తెగేవరకు సాగదీస్తే మొదటికే మోసం వస్తుందని కాంగ్రెస్ పార్టీ భావించడంతో సీట్ల పంకం లిస్ట్ ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.
కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న టీడీపీ కూడా సీట్ల విషయంలో పట్టు విడుపుగా ఉండడంతో కాంగ్రెస్ మరింత ముందుకు కదులుతోంది.తెలంగాణాలో టీఆర్ఎస్ ను గద్దె దించడమే తమ అందరి ఉమ్మడి లక్ష్యం అని అందుకోసం త్యాగాలకు కూడా సిద్ధపడాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న జరిగిన మీటింగ్ లో పార్టీ నేతలకు హితబోధ చేశారు.
అదీ కాకుండా….సీట్ల సర్దుబాటులో జాప్యం జరుగుతుండడంతో పాటు కోరినన్ని సీలు ఇవ్వలేదని ఇప్పటికే డెడ్ లైన్ మీద డెడ్ లైన్ పెడుతున్న ప్రొఫెసర్ కోదండరాం (టీజీఎస్) కూటమితో వ్యవహారం తేలేది కాదని .పొత్తుకోసం బీజేపీతో మంతనాలు జరుపుతున్నట్టు తెలియడంతో కాంగ్రెస్, టీడీపీలు అప్రమత్తమై వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చినట్టు తెలుస్తోంది.
మొత్తం 119 సీట్లలో కాంగ్రెస్ 90 స్థానాల్లో పోటీ చేయనుంది.
తెలుగుదేశం 15 స్థానాల్లో, టీజేఎస్ 10 చోట్ల, సీపీఐ 4 చోట్ల బరిలోకి దిగుతాయి.అంతేకాదు; ఆయా పార్టీలు విడివిడిగా కాకుండా, ఐక్యతకు చిహ్నంగా అన్ని పార్టీల అభ్యర్థులనూ ఉమ్మడిగా ఒకే వేదికపై ప్రకటిస్తారు.
అందుకోసం కూటంలోని పార్టీలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు.ఇందులో నాలుగు పార్టీల రాష్ట్ర శాఖల బాధ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
కేవలం అసెంబ్లీ ఎన్నికల కోణంలోనే కాకుండా వచ్చే లోక్సభ ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని సీట్ల పంపిణీ జరుగుతున్నట్టు తెలిసింది.అందుకే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ జాతీయ స్థాయి నాయకత్వాలు స్వయంగా పరిశీలిస్తూ, వివిధ సర్వేల ఆధారంగా ప్రతి సీటునూ ఆచితూచి ఎంపిక చేస్తున్నట్టు సమాచారం.
మహాకూటమి ప్రకటించే తొలి జాబితాలో 60 పేర్లు ఉండే అవకాశం ఉంది.కూటమిలో ప్రతి భాగస్వామ్య పక్షానికి కేటాయించే సీట్లలో సగం మంది అభ్యర్థుల పేర్లు తొలి జాబితాలో ఉండొచ్చు.కాంగ్రెస్ నుంచి 40-50 మంది, టీడీపీ నుంచి 8, టీజేఎస్ నుంచి 5, సీపీఐ నుంచి ఇద్దరి పేర్లను ప్రకటిస్తారని సమాచారం.మొత్తమ్మీద జాబితాలో 35 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు, మిగిలిన వారు ఓసీలు ఉండే అవకాశం ఉంది.60 మందిలో 35 దాకా ఎస్సీ, ఎస్టీ, బీసీలకే కేటాయించడం ద్వారా కూటమి వారికిచ్చే ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వ్యూహం రచించారు.
అలాగే ఇప్పుడున్న మహాకూటమి పేరు మార్చి సరికొత్త పేరుతో జనంలోకి వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
రెండు మూడు రోజుల్లో కూటమి వ్యవహారం కొలిక్కి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ మంగళవారం వెల్లడించారు.తొలి జాబితాను త్వరలో ప్రకటిస్తామని టీడీపీ టీఎస్ అధ్యక్షుడు రమణ తెలిపారు.
కూటమి నుంచి వైదొలగబోమని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ప్రకటించారు.మొత్తానికి కూటమి వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది.