ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అంటూ జగన్ పలు నిరసనలు కూడా చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలంటే మెజారిటీ ఎంపీ సీట్లలో గెలిపించాలంటూ 2019 ఎన్నికల సమయంలో ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ నేపథ్యంలో జగన్కు ఓ అవకాశం ఇచ్చి చూద్దామని ప్రజలు వైసీపీ ఏకంగా 22 ఎంపీ సీట్లను కట్టబెట్టారు.
సీన్ కట్ చేస్తే.ఇప్పటివరకు ఏపీకి ప్రత్యేకహోదాపై అతీ గతీ లేదు.
ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని.ప్రత్యేకహోదాతోనే పరిశ్రమలు, పన్ను రాయితీలు వస్తాయి.అడ్డంగా నరికిన మన రాష్ట్రానికి ప్రత్యేక హోదానే ప్రాణవాయువు.ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అంటూ ఎన్నో మాటలను ప్రతిపక్ష నేతగా ఆనాడు జగన్ చెప్పారు.
కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆయన ప్రత్యేకహోదాను పూర్తిగా గాలికొదిలేశారు.ఎదురు ప్రశ్నిస్తే తాము మేనిఫెస్టోలో ఆ అంశాన్ని పెట్టలేదు కదా అని వైసీపీ నేతలు తప్పించుకుంటున్నారు.
ఇప్పటివరకు హోదా అంశంపై బీజేపీని ఇరకాటంలో పెట్టే విధంగా జగన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఈ విషయం అందరికీ తెలిసిందే.కనీసం రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా అయినా ప్రత్యేక హోదా అంశంపై జగన్ బీజేపీని డిమాండ్ చేస్తారని పలువురు రాజకీయ ప్రముఖులు ఎదురుచూశారు.అది కూడా జరగలేదు.
ఎలాంటి డిమాండ్ లేకుండానే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు పలుకుతున్నట్లు బహిరంగ ప్రకటన చేసింది.
వైసీపీ తాజా వైఖరి చూశాక ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయమని.
ఈ విషయంలో వైసీపీని నమ్ముకున్న ప్రజలు తీవ్రస్థాయిలో భంగపడినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.గిరిజన మహిళకు రాష్ట్రపతి అవకాశం ఇచ్చినందుకు తాము మద్దతు పలుకుతున్నామని ప్రకటన చేసిన వైసీపీ.ప్రత్యేక హోదా వస్తే ఏపీలో ఉన్న అందరితో పాటు గిరిజనులు కూడా బాగుపడతారని ఎందుకు గ్రహించలేకపోతుందని పలువురు సూటిగా ప్రశ్నిస్తున్నారు.ఎటువంటి షరతులు లేకుండా, ఎటువంటి ప్రతిపాదనలను తెరపైకి తీసుకు రాకుండానే ఏ విధంగా బీజేపీకి మద్దతు ఇస్తారని టీడీపీ నేతలు కూడా జగన్ను నిలదీస్తున్నారు.