ఏపీలో ఈ సంవత్సరం ఉప ఎన్నికలు జోరు బాగానే కనిపిస్తోంది.మొన్నటికి మొన్న తిరుపతి ఉప ఎన్నిక రాష్ట్రంలో ఎంత హంగామా సృష్టించిందో చూశాం.
ఇక దాన్ని మర్చిపోకముందు ఇప్పుడు మళ్లీ రెండు ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.రాయలసీమ జిల్లా అయిన కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య నాలుగు నెలల కిందట మరణించిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే ఇప్పటికే ఆయన చనిపోయి నాలుగు నెలలు కావస్తోంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ స్థానానికి ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా కూడా చాలా వరకు ఎన్నికలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే.
ఇదే నేపథ్యంలో ఈ నియోజకవర్గానికి కూడా ఉపెన్నికలు వాయిదా పడ్డాయి.
ఇక బద్వేల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చే రెండు నెలల్లోగా అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో నెలల్లో కచ్చితంగా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇంకోవైపు తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ ఉపెన్నికల ఇప్పటికే జోరుమీద ఉంది.నోటిఫికేషన్ రాకముందే ఇక్కడ ప్రచారం హోరెత్తుతోంది.దీనికి కూడా బద్వేల్తో పాటే ఉపఎన్నిక జరిగే అవకాశం ఉంది.
ఇక ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ఉద్యమ నేపథ్యంలో రాజీనామా చేశారు.
అయితే ఆయన రాజీనామాపై స్పీకర్ ఇంకా ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
ఒక వేళ స్పీకర్ గనక ఆయన రాజీనామాను అంగీకరిస్తే బద్వేల్తో పాటే ఇక్కడ కూడా ఉపఎన్నిక వచ్చే ఛాన్స్ ఉంది.అయితే ఈ రెండింటిలో ఒకటి వైసీపీకి, రెండోది టీడీపీకి సిట్టింగ్ స్థానం. కానీ బద్వేల్ వైసీపీ చాలా బలంగా ఉంది.
దాదాపు గత ఇరవైఏళ్లుగా ఇక్కడ టీడీపీ కనీసం పోటీ కూడా ఇవ్వట్లేదు.ఇక విశాఖ నార్త్ నియోజకవర్గానికి టీడీపీ ఉన్నా కూడా పెద్దగా బలంగా లేదు.
ఒకవేళ వైసీపీ వేవ్ ఇక్కడ కూడా కొనసాగితే టీడీపీ మరో ఎమ్మెల్యే స్థానాన్ని కోల్పోవడం ఖాయమే.