మొన్నటి వరకు ఏపీ శాసనసభ మండలి రద్దు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే.మూడు రాజధానులకు మద్దతుగా శాసనసభలో తీర్మానం చేసిన బిల్లును శాసన మండలిలో తిరస్కరించడంతో ఆగ్రహం చెందిన ఏపీ సీఎం జగన్ శాసనసభలో శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం చేశారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది.వైసీపీ ఈ విషయంలో కేంద్రం సానుకూలంగా ఉండడంతో శాసన మండలి రద్దు అయిపోతుందని అందరూ భావించారు.
అయితే ఇప్పుడు మాత్రం మండలి మరో ఏడాదిన్నర వరకు రద్దయ్యే అవకాశం లేదనే విషయం తేలిపోయింది.ఈ విషయంలో వైసీపీ మైండ్ గేమ్ కు తెర తీసినట్టుగా అర్థమవుతోంది.
ప్రస్తుతం టిడిపి ఎమ్మెల్సీలు అందరిని తమ గూటికి తెచ్చుకోవాలని చూస్తున్న వైసిపి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది.ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్ రెడ్డి వైసీపీ కి మద్దతు ప్రకటించారు.మరో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ టిడిపికి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకున్నారు.కర్నూలు జిల్లా సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ ప్రభాకర్ కూడా వైసీపీ లో చేరడం దాదాపు ఖాయమైపోయింది.
అలాగే అనంతపురం జిల్లాకు చెందిన మరో ఎమ్యెల్సీ వైసిపిలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.మొత్తం ఐదుగురు టిడిపి ఎమ్యెల్సీలు వైసిపి కి అనుకూలంగా ఉండడంతో మరో ఐదుగురు ఎమ్మెల్సీలపై వైసిపి పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి వారితో చర్చలు జరుపుతోంది.
బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యేలోపు వారంతా టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చేలా ప్లాన్ చేస్తోంది.
టీడీపీకి బలం లేకుండా చేసి సెలక్ట్ కమిటీకి పంపిన రెండు బిల్లులను వెనక్కి తెప్పించడంతో పాటు వాటిని ఆమోదింపజేసుకోవాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది.
ఒకవేళ శాసనమండలి రద్దు చేయాలని అనుకున్నా, దానికి ఏడాదిన్నర సమయం పడుతుంది.అప్పటిలోగా వైసిపికి శాసనమండలిలో మెజార్టీ వస్తుంది.
ఈ విషయం వైసీపీకి ముందే తెలిసినా, టిడిపి ఎమ్మెల్సీలను తమ దారిలోకి తెచ్చుకునేందుకు ఈ విధంగా మండలి వ్యవహారాన్ని తెరపైకి తెచ్చినట్లు అర్థం అవుతోంది.