మాజీ మంత్రి, పాత టీడీపీ, ప్రస్తుత టీఆర్ఎస్ కీలక నేత తుమ్మల నాగేశ్వరరరావు కేంద్రంగా తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అంశం తెరమీదకు వచ్చిందా ? అంటే తాజా రాజకీయ పరిణామాలు అవుననే చెపుతున్నాయి.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా.
ఏ పార్టీలో ఉన్నా కూడా తుమ్మల చక్రం తిప్పుతూ వచ్చారు.ఎప్పుడు అయితే తుమ్మల గత ఎన్నికల్లో పాలేరులో ఓడిపోయారో అప్పటి నుంచి ఆయన డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యింది.
జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చక్రం తిప్పుతుండడంతో పాటు తుమ్మల అన్న పేరు వినడపకుండా చేయడంలో సక్సెస్ అవుతున్నారన్న ప్రచారం కూడా ఉంది.తుమ్మలకు కేసీఆర్ ఏదో ఒక పదవి ఇవ్వాలనుకుంటున్నా కేటీఆర్ – పువ్వాడ ఈ విషయంలో ఆయనకు పదవి రాకుండా తెరవెనక చేయాల్సింది చేస్తున్నారన్న అంతర్గత ప్రచారం అయితే ఉంది.
ఈ ప్రచారం ఎలా ఉన్నా కేసీఆర్ తుమ్మలకు పదవి ఇవ్వాలనుకుంటే ఎప్పుడు అయినా ఇచ్చే ఛాన్స్ ఉంది.
ఇదిలా ఉంటే టీఆర్ఎస్లో తుమ్మల అసంతృప్తితో ఉన్నారని వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఆయనపై బీజేపీ గురి పెట్టిందంటున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల వియ్యంకుడు గరికపాటి రామ్మోహన్ రావు కొందరు టీడీపీ నేతలను తనతో పాటు బీజేపీలోకి తీసుకువెళ్లారు.ఈ క్రమంలోనే తుమ్మల పార్టీలో చేరితే ఇప్పటికిప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ మరీ అంత బలపడదు… అటు తుమ్మలకు ఒనగూరే రాజకీయ ప్రయోజం ఉండదు.
అయితే తుమ్మలకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పరిచయాలు, అటు ఏపీలో ఉన్న బంధుత్వాలు, స్నేహితుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి ప్లస్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి.అటు గ్రేటర్ హైదరాబాద్లో కూడా తుమ్మలకు మంచి బలం ఉంది.
పైగా టీఆర్ఎస్లో కమ్మ వర్గానికి మరీ అంత ప్రయార్టీ ఇవ్వడం లేదు.ఈ క్రమంలోనే తుమ్మలపై బీజేపీ గురి పెట్టిందంటున్నారు.
మరి ఈ విషయంలో తుమ్మల నిర్ణయం ఎలా ఉంటుంది ? అన్న దానిపై తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు ఉంటాయా ? లేదా ? అన్నది చూడాలి.