నరసాపురం వైసీపీ ఎంపీ రఘురాం కృష్ణంరాజు కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈనెల నాలుగో తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం నియోజకవర్గంలోని భీమవరంలో అల్లూరు సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు.
ఈ కార్యక్రమానికి భారీగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి.స్థానిక ఎంపీ హోదాలో ప్రధాని పర్యటనకు హాజరయ్యేందుకు ఎంపీ రఘురామ కృష్ణంరాజు సిద్ధమైనా, నియోజకవర్గంలో తాను అడుగుపెట్టగానే వైసీపీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవడంతోపాటు, పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ఆందోళనలో ఆయన ఉన్నారు ఇప్పటికే ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖకు రఘురామ ఫిర్యాదు చేశారు.
ఏపీ పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా చూడాలని, ప్రధాని పర్యటనలో తాను పాల్గొంటానని వారిని కలిసి విన్నవించారు.ప్రధాని కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ హోదాలో తాను పాల్గొని తన సత్తా చాటాలని రఘురామ ప్రయత్నిస్తున్నారు.
అయితే వైసిపి ప్రభుత్వం తనపై తప్పకుండా ప్రతికార చర్యక దిగుతుందనే భయమూ రఘురామను వెంటాడుతోంది.
వైసిపి నుంచి ఎంపీగా గెలిచిన కొద్ది కాలానికే ఆ పార్టీ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని తప్పుపడుతూ, కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు.ఈ క్రమంలోనే ఆయనపై ఇప్పటికే నరసాపురం నియోజకవర్గంలో అనేక పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు నమోదు అయ్యాయి.
ఈ క్రమంలోనే రఘు రామ అరెస్టు భయంతో ఉన్నారు.వాస్తవంగా ఆయన ఎప్పుడో వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ మేరకు ఫిబ్రవరిలోనే తాను రాజీనామా చేయబోతున్నాను అని ప్రకటన కూడా చేశారు.అయితే ఇప్పుడు ఆయన వెనక్కి తగ్గడానికి కారణం బిజెపి నుంచి స్పందన రాకపోవడమే అని తెలుస్తోంది.
రఘురామను ఎన్నికల సమయంలో పార్టీలో చేర్చుకుని నరసాపురం నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థిగా పోటీ చేయించాలని టీడీపీ చూస్తోంది.ఈ మేరకు ఆయనకు హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం.జనసేనతో పొత్తు ఉన్నా, రఘురామకు సీటు కేటాయించాలని నిర్ణయించుకోవడమే కాకుండా, హామీ కూడా ఇచ్చిందట.టిడిపి సూచన మేరకే వైసీపీలోనే ఉంటూ ఎన్నికల సమయం వరకు ఆ పార్టీని ఇరుకుని పెట్టాలని రఘురామ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఇప్పుడు నరసాపురం నియోజకవర్గంలో జరగబోతున్న ప్రధాని పర్యటనకు తాను హాజరవ్వాలని , ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తే దాన్ని రాజకీయంగా అనుకూలంగా మార్చుకోవాలని రఘురామ డిసైడ్ అయినట్లు సమాచారం.