తెలంగాణ రాజకీయాలలో పాదయాత్రల పర్వం కొనసాగుతూ వస్తోంది.ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్ర పేరిట మొదటి దఫా పాదయాత్రను నిర్వహించిన బండి సంజయ్ త్వరలో రెండో దఫా ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టే అవకాశం ఉంది.
అయితే ప్రస్తుతం తెలంగాణలో షర్మిల పాదయాత్ర నిర్వహస్తున్న విషయం విదితమే.ఆంధ్రా పాలనకు వ్యతిరేకంగా ఏర్పాటైన తెలంగాణలో మరల ఆంధ్రా నాయకుల నాయకత్వాన్ని ప్రజలు ఒప్పుకుంటారా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉన్న పరిస్థితి ఉంది.
ప్రస్తుతం తెలంగాణలో వైఎస్సార్ ప్రజా ప్రస్థానం పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్రకు ఊహించిన స్పందన మాత్రం రావడం లేదు.వైఎస్సార్ టీపీ పార్టీని ఏర్పాటు చేసిన షర్మిల పార్టీ ని తెలంగాణలో సుస్థిరం చేసేందుకు రకరకాల వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి ఉంది.
మొన్నటి వరకు నిరుద్యోగ దీక్షలను చేపట్టిన షర్మిల ప్రస్తుతం పాదయాత్ర పేరుతో వ్యూహం రచించినా పెద్దగా ఏ పార్టీని విమర్శించినా తిరిగి కౌంటర్ రాకపోవడం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి లాంటి నాయకులు షర్మిల పార్టీ ఒక ఎన్జీవో సంస్థ అని, మీడియా కూడా షర్మిల వ్యాఖ్యలకు, పార్టీకి ప్రాధాన్యత ఇవ్వవలిసిన అవసరం లేదని బహిరంగంగా వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది.షర్మిల తన పాదయాత్రతో పెద్ద ఎత్తున ప్రచారాన్ని, ఆదరణను ఊహించినా క్షేత్ర స్థాయిలో షర్మిల పార్టీ అంటే కూడా ఏదో తెలియని పరిస్థితి ఉంది.
అంతేకాక పాదయాత్రతో ప్రస్తుతం బలంగా ఉన్న పార్టీల సరసన చేరి రాష్ట్రమంతా గుర్తింపు వచ్చాక క్యాడర్ ను క్రమంగా నిర్మించుకోవచ్చని షర్మిల వ్యూహం రచించినా వ్యూహం బెడిసి కొట్టింది.అయినా తాను చేపట్టిన నాలుగు వేల కిలోమీటర్ ల పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసేందుకు షర్మిల సిద్దమైంది.మరి పాదయాత్ర పూర్తయ్యేటప్పటికీ రాష్ట్రమంతా పాదయాత్ర పట్ల చర్చ నడుస్తుందో లేదో చూడాల్సి ఉంది.