రోజు రోజుకి జనసేన రాజకీయ భవిష్యత్తుపై నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి.ఈ ఎన్నికల్లో సాక్షాత్తు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమి చెందడం, ఆ పార్టీకి ఒక్క సీటే దక్కడం ఇవన్నీ పార్టీ నాయకులకు మింగుడుపడడంలేదు.
ఇక ఎన్నికలు ముగిసిననాటి నుంచి పవన్ కూడా ఎవరికీ పెద్దగా టచ్ లోకి రాకపోవడం ఇవన్నీ ఆ పార్టీ నాయకుల్లో ఆందోళన పెంచుతున్నాయి.జనసేనలో ఉండాలా వద్దా అనే సందేహంలో కొట్టుమిట్టాడుతుండగానే తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి గురువారం వచ్చిన పవన్ కాస్తంత హడావిడి చేశారు.
అయితే ఈ హడావిడిలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు ముఖ్య నేతలు అక్కడ కనిపించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
జనసేన లో కీలకంగా వ్యవహరించడంతో పాటు పవన్ వెన్నంటే తిరిగిన నాదెండ్ల మనోహర్, విశాఖ ఎంపీగా పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ మాత్రం పార్టీ అధినేత నిర్వహించిన సమీక్షలో కనిపించకుండాపోయారు.ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ భవిష్యత్తు ఏమిటన్న విషయాన్ని తేల్చేందుకు పవన్ తాడేపల్లి కార్యాలయానికి రాగా… ఈ ఇద్దరు మాత్రం అక్కడ కనిపించలేదు.దీంతో వారిద్దరూ ఎందుకు ఈ భేటీకి రాలేదన్న కోణంలో విశ్లేషణలు మొదలయ్యాయి.నాదెండ్ల మనోహర్ పార్టీలో చేరిన నాటి నుంచి పవన్ వెన్నంటే నడిచారు.పవన్ ఎక్కడికెళ్లినా ఆయన పక్కనే కనిపించారు.పార్టీలో నెంబర్ టూగా కనిపించిన నాదెండ్ల… ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం తెనాలి నుంచి పోటీ చేశారు.
అయితే వైసీపీ ప్రభంజనం ముందు ఆయన కొట్టుకుపోయారు.
విశాఖ ఎంపీగా పోటీ చేసిన లక్ష్మీనారాయణ పరిస్థితి కూడా ఇంతే.బాండ్ పేపర్ పై హామీలను రాసిచ్చిన లక్ష్మీనారాయణ గెలుపు ఖాయం అని అంతా అనుకున్నారు.అయితే విశాఖ జిల్లాలోనూ వైసీపీ వైపు వీచిన గాలిలో లక్ష్మీనారాయణ కూడా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
ఈ ఓటమి వారిద్దరినీ బాగా నిరాశపరచడంతో పాటు ఇక జనసేన పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేదు అనే ఒక అభిప్రాయానికి వారు వచ్చేసినట్టు కనిపిస్తోంది.ఇంతా భారీ ఓటమి తరువాత నిర్వహించే సమీక్షలకు, సమావేశాలకు వెళ్లినా ప్రయోజనం ఏముంటుంది.
ఇక ఆ పార్టీతో ముందుకు వెళ్లినా రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే అభిప్రాయానికి వారు రావడంతోనే ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారనే ప్రచారం ఇప్పుడు జోరందుకుంది.