దేశవ్యాప్తంగా బిజెపికి ఎదురుగాలి వీస్తోంది.ముఖ్యంగా ద్రవ్యోల్బణం అదుపులో లేకపోవడం, విపరీతంగా పెరిగిన ధరలు, సామాన్యులు ధైర్యంగా బతకలేని పరిస్థితి ఏర్పడడం , ఇవన్నీ కేంద్ర అధికార పార్టీ బిజెపిపై జనాల్లో వ్యతిరేకత పెంచుతున్నాయి.
అయితే బీజేపీకి ప్రత్యామ్నాయంగా జాతీయస్థాయిలో మరో పార్టీ కనిపించడం లేదు.కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉనికి కోల్పోయే పరిస్థితి కి వచ్చింది.
ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ వంటి వారు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు.అయితే కేంద్రంలో బిజెపిని ఢీకొట్టేందుకు మూడో ప్రత్యామ్నాయ కూటమి తెరపైకి వచ్చింది.
ఈ కూటమిలో మమతా బెనర్జీ, కెసిఆర్ వంటి వారు కీ రోల్ పోషించారు.
ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల అధినేతలను కలుస్తూ, బిజెపి వ్యతిరేక కూటమిని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తూనే వస్తున్నారు.
ఈ కూటమిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొదట్లో యాక్టివ్ గా కనిపించారు.బిజెపికి నిత్యం సవాళ్లు విసురుతూ, కేంద్రం తమను ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టిన వాటిని ఎదుర్కొంటూ వచ్చారు.
అయితే కొద్ది రోజుల క్రితం మమతా బెనర్జీ మంత్రివర్గంలో ఉన్న పార్థ చటర్జీని ఈడి అధికారులు పట్టుకోవడం, భారీగా నగదు స్వాధీనం చేసుకోవడం తదితర సంఘటనలతో మమత ఉలిక్కిపడ్డారు.
ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో ఆమె భేటీ అయ్యారు.ఇక అప్పటి నుంచి ఆమె కేంద్రంతో తలపడేదే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు .ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగానే ఉన్నారు.ఇక మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే పరిస్థితి చూసిన తర్వాత అందరూ సైలెంట్ అయిపోయారు.ఇప్పుడు దేశవ్యాప్తంగా కేంద్ర అధికార పార్టీ బిజెపిపై విమర్శలు చేసే సాహసం ఎవరు చేయలేకపోతున్నారు.
కానీ ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం దూకుడుగా వ్యవహరిస్తున్నారు.కేంద్రం చేతిలో ఉన్న ఈడి , సి బి ఐ, ఐటి వంటి సంస్థలు ఇప్పటి వరకు బిజెపి రాజకీయ ప్రత్యర్థులపై దాడులు నిర్వహించిన తీరు చూసిన తర్వాత కూడా కెసిఆర్ వెనక్కి తగ్గడం లేదు.
దీంతో అసలు కేసీఆర్ ఏ ధైర్యం ఇంత దూకుడుగా ముందుకు వెళ్తున్నారు అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.తెలంగాణలో టిఆర్ఎస్ పరిస్థితి గతంలో ఉన్నంత సానుకూలంగా లేకపోయినా, కేసిఆర్ బిజెపి విషయంలో వెనక్కి తగ్గకపోవడం వంటివి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
ఈ విషయంలో కెసిఆర్ దూకుడు ముందు ముందు ఇబ్బందులు తీసుకొచ్చే అవకాశం ఉంటుందనే ఆందోళన కూడా టీఆర్ఎస్ నేతల్లో ఉంది.