ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలను వరుస పెట్టి చేర్చుకుంటున్నారు.చాలా వ్యూహాత్మకంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు వైసీపీ కండువాలు కప్పకపోయినా వారి కుటుంబ సభ్యులకో, వారసులకు వైసీపీ కండువాలు కప్పుతున్నారు.
ఇక ఇప్పటికే జనసేన ఏకైక ఎమ్మెల్యేతో పాటు నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ సానుభూతి పరులుగా మారారు.ఇక ఇదే లిస్టులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం ఉన్నారన్న వార్తలు గత కొంత కాలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.
మంత్రి పదవి లేకపోతే గంటాకు రాజకీయంగా నిద్రపట్టదన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారేందుకు రెడీగా ఉన్నా ఆయనకు ఎంతో ఇష్టమైన మంత్రి పదవిపై వైసీపీ నుంచి ఆఫర్లు లేకపోవడంతోనే గంటా కండువా మార్చేందుకు తటపటాయిస్తున్నారు.
అయితే గంటా మంత్రి పదవి కోసం అవసరం అయితే తన ఎమ్మెల్యే పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లి అయినా గెలిచి మంత్రి పదవి సొంతం చేసుకునేందుకు కూడా ఆయన వెనుకాడడం లేదట.
ఈ క్రమంలోనే గంటాకు మంత్రి పదవి ఇచ్చేందుకే ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రిని పక్కన పెట్టాలన్న చర్చలు కూడా వైసీపీ అధిష్టానం దగ్గర నలుగుతున్నాయట.
ఎలాగూ మరో పది నెలల్లో జగన్ తన కేబినెట్ను చాలా వరకు ప్రక్షాళన చేస్తారు.ఈ నేపథ్యంలోనే ఈ లోగా ఉప ఎన్నికలకు వెళ్లి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే అప్పుడు గంటాకు మంత్రి పదవి ఇచ్చేందుకు జగన్ నుంచి అభ్యంతరాలు ఉండవు.
అయితే అందుకు ముందుగా హామీ రావాల్సి ఉంది.
ఇప్పటికే వైజాగ్లో దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ వైసీపీ సానుభూతిపరుడిగా మారిపోయారు.
మరి గంటా తన కుమారులను పార్టీలో చేర్చి.తాను బయట నుంచి మద్దతు ఇస్తారా ? లేదా ఖచ్చితంగా మంత్రి పదవిపై హామీ వస్తే ఉప ఎన్నికలకు వెళతారా ? అన్నది చూడాలి.