2019 ఎన్నికలకు ముందు బీజేపీ మీద జగన్ ఎన్నో విమర్శలు చేశారు.కానీ ఆనాడు జగన్ ప్రతిపక్షంలో ఉండటంతో బీజేపీ నేతలు ఆయన వ్యాఖ్యలను పట్టించుకోలేదు.
ఆ సమయంలో కేవలం అధికారంలో ఉన్న చంద్రబాబుపైనే కమలం పార్టీ నేతలు ఫోకస్ చేశారు.కానీ ప్రత్యేక హోదా కావాలంటే కేంద్రం మెడలు వంచాలని.
అందుకు తనకు బలాన్ని ఇవ్వాలని జగన్ పదే పదే ప్రచారం చేశారు.దీంతో 2019 ఎన్నికల్లో ప్రజలు జగన్ను నమ్మి 22 ఎంపీ సీట్లను కట్టబెట్టారు.
ఆనాడు కేంద్రం మెడలు వంచుతామని సినిమా డైలాగులు చెప్పిన జగన్ ఈనాడు ఆయనే కేంద్రం ముందు మెడలు వంచుకుని నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది.ఏపీకి రావాల్సిన అంశాల విషయానికి చూస్తే.
అఖండ మెజారిటీ ఉన్నా జగన్ కేంద్రాన్ని ఎదురించిన దాఖలాలే లేవు.ఆఖరుకు ప్రత్యేక హోదా వంటి అంశాల మీద కూడా మాట్లాడటం లేదు.
రాష్ట్రపతి ఎన్నికల్లో అయినా ఏపీకి సంబంధించి కొన్ని డిమాండ్లు పెట్టి బీజేపీ అభ్యర్ధికి వైసీపీ మద్దతిస్తే బాగుండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
కానీ ఎలాంటి డిమాండ్లు లేకుండానే బీజేపీకి జగన్ మద్దతు ఇచ్చేశారు.
ఒకరకంగా బీజేపీకి జగన్ భయపడుతున్నారనే సంకేతాలను ప్రజల్లోకి పంపించారనే టాక్ వినిపిస్తోంది.
జగన్ వెనుక ఈడీ కేసులు, సీబీఐ కేసులు చాలానే ఉన్నాయి.వాటిని తవ్వుకోవడం ఇష్టం లేకే బీజేపీకి జగన్ అప్పన్నంగా మద్దతు ఇస్తున్నారన్న కామెంట్లు వస్తున్నాయి.గత 8 ఏళ్ల కాలంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిందేమీ లేదు.
పోలవరం అలాగే ఉంది.రాజధాని ఊసు లేదు.
విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తున్నారు.విభజన హామీలకు అతీగతీ లేదు.
ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నిక సమయంలో జగన్ మొండి పట్టుపడితే కేంద్రం తనంతట తను దిగి వస్తుందని అందరూ భావించారు.ఒక్క గిరిజనురాలికి లబ్ధి చేకూర్చేందుకు ఏపీలోని లక్షలాది మంది గిరిజనుల ప్రయోజనాలను వైసీపీ తాకట్టు పెట్టడమేంటని రాజకీయ మేధావులు ప్రశ్నిస్తున్నారు.ప్రస్తుతానికి జగన్ బీజేపీకి మద్దతు ఇచ్చినా ఇప్పటికీ డిమాండ్లు సాధించుకునేందుకు సమయం ఉందంటున్నారు.రాష్ట్రంలో కీలకమైన 2.5 శాతం ఓటు బ్యాంకుగా ఉన్న గిరిజనుల కోసం, వారి అభివృద్ధి కోసం జగన్ కఠిన నిర్ణయం తీసుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.