తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న బిజెపికి ఇప్పుడు కోవర్టుల అంశం పెద్ద స్పీడ్ బ్రేకర్ గా మారింది.తెలంగాణ బిజెపిలో కేసీఆర్ కోవర్ట్ లు ఉన్నారంటూ ఇటీవలే బిజెపి చేరికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఇక అప్పటి నుంచి ఈ కోవర్ట్ ల అంశంపై తెలంగాణ బిజెపిలో పెద్ద చర్చ జరుగుతోంది.దీనికి తగ్గట్లుగానే ఇటీవల కాలంలో బిజెపిలోకి పెద్దగా చేరికలు కనిపించడం లేదు.
చేరుదాం అనుకున్న నాయకుల వివరాలు ముందుగానే లీక్ అవుతుండడంతో, వారు చేరికలను వాయిదా వేసుకుంటున్నారు.ఎక్కడ ఏ పార్టీలోనూ లేని విధంగా తెలంగాణ బిజెపిలో చేరికలు కమిటీని ఏర్పాటు చేశారు.
దీనికి చైర్మన్ గా ఈటెల రాజేందర్ ను నియమించారు.పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కు చెందిన నాయకులను బిజెపిలో చేర్పించడమే లక్ష్యంగా ఈటెల రాజేందర్ రంగంలోకి దిగారు.
తనకు ఉన్న పాత పరిచయాలతో బీఆర్ఎస్ నేతలకు గాలం వేసి, బిజెపిని బలోపేతం చేయాలని ప్రయత్నిస్తున్నారు.అయితే మొదట్లో కాస్తో కూస్తో చేరికలు కనిపించినా, ఈ మధ్యకాలంలో అవి పూర్తిగా నిలిచిపోయాయి.
దీనికి కారణం పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న కోవర్ట్ లే కారణమని ఈటెల అభిప్రాయపడుతున్నారు.
ఇదే విషయాన్ని బహిరంగంగా వ్యాఖ్యానించారు.దీంతో పార్టీలో ఉన్న కోవర్ట్ లు ఎవరు ? వారు ఏ స్థాయిలో ఉన్నారు ? ఎంత కాలం నుంచి ఈ కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అనే విషయంపై బిజెపిలో అంతర్గతంగా విచారణ జరుగుతుంది.ఇటీవల ఇతర పార్టీల నుంచి బిజెపిలోకి వెళ్తున్నారంటూ కొంతమంది నాయకుల పేర్లు ప్రాథమిక చర్చలు సమయంలోనే బయటకు లీక్ కావడంతో ఇదంతా కోవర్ట్ ల పని అని, బిజెపి అధిష్టానం సైతం భావిస్తోంది .దీంతో ఈ విషయంలో సీరియస్ గా ఉండాలని, కోవర్ట్ లను గుర్తించి వారిని పక్కన పెట్టాలని నిర్ణయించుకుంది.అయితే ఇప్పుడు బిజెపిలో ఉన్న కోవర్ట్ లలో కేసీఆర్ ఇన్ఫార్మర్లు ఎవరు ? వారు ఏ స్థాయిలో ఉన్నారు ? వారిని ఏ విధంగా గుర్తించాలి ? గుర్తించిన తర్వాత వారిని ఏ విధంగా పక్కన పెట్టాలి అనే విషయంపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.కోవర్టులను సాక్షదారాలతో సహా పట్టుకోవాలని , ఇప్పుడు వారిని కట్టడి చేయకపోతే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పార్టీని మరింతగా వారు దెబ్బతీస్తారని, బీ ఆర్ ఎస్ కు అనుకూలంగా బిజెపి వ్యవహారాలను బయటకు లీక్ చేస్తారనే భయం ఇప్పుడు తెలంగాణ బిజెపిలో కనిపిస్తోంది.ఇటీవల జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి చెందడానికి కేసీఆర్ కోవర్ట్ లే కారణమని ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి.
మునుగోడు పోలింగ్ కు కొన్ని రోజులు ముందు కొంతమంది నేతలు కేసీఆర్ , కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరడం తో మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి.ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడం తో బిజెపి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థుల కోసం వెతుకుతోంది.ఇప్పటికే 30 చోట్ల బలమైన అభ్యర్థులను గుర్తించగా, మరికొన్ని చోట్ల అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తుంది.బలమైన నాయకులను బిజెపిలో చేర్చుకుని వారిని పోటీకి దించి సక్సెస్ కావాలని చూస్తుండగా, ఇప్పుడు కోవర్టుల వ్యవహారం తలనొప్పిగా మారింది.
బలమైన ఇతర పార్టీల్లోని నాయకులు బిజేపి లో చేరేందుకు ఆసక్తి చూపించకపోవడానికి ఈ కోవర్ట్ ల భయమే కారణం కావడంతో, ఈ విషయంలో బిజెపి సీరియస్ గా ఇప్పుడు యాక్షన్ లోకి దిగుతోంది.